ముస్లింలుకు పరం పవిత్ర మైన మసీదు మక్కా మసీదు . ప్రపంచం లో ఉండే ప్రతి ముస్లిం ఎప్పుడో ఒకసారైనా మక్కా మసీదు ను దర్సించాలనుకుంటాడు. మక్కా మసీదు యాత్ర ఒక అద్భుతం అని చెప్పాలి. ఇదేరోజు అరేబియా దేశంలోని మక్కా నగరంలో ’హజ్’ ఆరాధన జరుగుతుంది. లక్షలాదిమంది యాత్రికులతో ఆ పవిత్రనగరం కళకళలాడుతూ ఉంటుంది. అల్లాహ్ ఆదేశాలను, ప్రవక్తవారి సంప్రదాయాలను పాటించడంలో భక్తులు నిమగ్నమై ఉంటారు.
ఆ జనవాహినిలో ‘తవాఫ్’ చేసేవారు కొందైరతే, ‘సఫా మర్వా’ కొండలమధ్య సయీ’ చేసేవారు మరికొందరు. అదొక అపురూపమైన సుందరదృశ్యం. రమణీయమైన అద్భుత సన్నివేశం. అల్లాహ్ స్తోత్రంతో పరవశించి తన్మయత్వం చెందే ఆధ్యాత్మిక కేంద్రబింబం. ఆ అపూర్వ హజ్ దృశ్యాన్ని ఊహిస్తేనే హృదయం పులకించి పోతుంది. ఒకప్పుడు ఎలాంటి జనసంచారమే లేని నిర్జీవ ఎడారి ప్రాంతమది. కాని ఈనాడు విశ్వప్రభువు అనుగ్రహంతో నిత్యనూతనంగా కళకళలాడుతూ యావత్ ప్రపంచ ముస్లిం సమాజానికి ప్రధానపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
ఆ పుణ్యక్షేత్రమైన మక్కాలో జరిగే హజ్ ఆరాధనకు, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే ఈదుల్ అజ్ హా పండుగకు అవినాభావ సంబంధం ఉంది. దైవభీతి, పాపభీతి, బాధ్యతాభావం, సత్యం, న్యాయం, ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను మనసులో ప్రతిష్టించుకోవాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఏ త్యాగానికైనా సదా సన్నద్ధులై ఉండాలి. ధనప్రాణ త్యాగాలతో పాటు, మనోవాంఛలను త్యాగం చెయ్యాలి. స్వార్థం, అసూయా ద్వేషాలనూ విసర్జించాలి. సాటివారి సంక్షేమం కోసం ఎంతోకొంత త్యాగం చేసే గుణాన్ని అలవరచుకోవాలి. ఈవిధమైన త్యాగభావాన్ని మానవుల్లో జనింపజేయడమే ఈదుల్ అజ్ హా (బక్రీద్ )పర్వదిన పరమార్థం.