క్రిస్టమస్ క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రోజు. అయితే యేసు క్రీస్తు పుట్టిన రోజును క్రైస్తవులు పండుగ చేసుకుంటారు. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా భావించి నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు.
అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు ' నజరేతు ' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్తో పెళ్ళికుదిరింది. ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి 'ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి 'యేసు' అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు' అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచి పెట్టాలని ఆలోచించసాగాడు.
అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తన్ను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు.' అని చెప్పాడు. జోసఫ్ న్యాయవంతుడు భక్తుడు. కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు.జోసఫ్ స్వగ్రామం బెత్లేహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది.