దేశంలోని ప్రతీ కొంపకు కరెంట్ ఇచ్చాం అని గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్రమోడీ గారు ఒక్క సారి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని 30 పల్లెల వైపు చూడాలి. అక్కడి ప్రజలకు విద్యుత్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. మూడొందలకు పైగా, గొత్తికోయల కుటుంబాలు చీకట్లోనే జీవిస్తున్నారు.
కొత్తగూడెం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో మారుమూల అటవీప్రాంతంలో గొత్తికోయలకు గుంపులుగా జీవిస్తున్నారు. వీరు ఛత్తీస్గఢ్ నుంచి బతుకుదెరువు కోసం నాలుగు దశాబ్దాల క్రితమే వలస వచ్చారు.
కనీస వసతులు లేవు...
'' వీరికి విద్యుత్ ఒక్కటే కాదు కనీస అవసరాలైన తాగునీరు, వైద్యం కూడా అందుబాటులో లేవు. రాత్రులు జంతువులు దాడి చేయకుండా మంటల వేసుకొని బతుకుతున్నారు. అధికారులు వీరి సమస్యలు పరిష్కరిస్తే భవిష్యత్ ఉంటుంది...'' అని వారి మధ్య ఉంటూ వారికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నరేందర్ అన్నారు.
ఇటీవల రాజ్య సభకు కేంద్రవిద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ అందచేసిన వివరాల ప్రకారం తెలంగాణలో విద్యుత్ లేని కుటుంబాల సంఖ్య 3.83లక్షలు.