రిటైరైన జర్నలిస్ట్ లకు నెలకు 6వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు ఒక దయగల సర్కారు ముందుకు వచ్చింది. అయితే అది ఆంధ్ర ప్రదేశో, తెలంగాణానో కాదు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
60సంవత్సరాల వయసు నిండి, ఒకే సంస్థ లోగాని, అంతకు మించి ఎక్కువ సంస్థల్లో గాని, కనీసం 20 సంవత్సరాలు లేదా అంతకు మించి ఎక్కువ పాత్రికేయ అనుభవం కలిగిన జర్నలిస్టులు, ఈ పెన్షన్ కు అర్హులు. ఎడిటర్, సబ్ ఎడిటర్, రిపోర్టర్, ఫోటోగ్రాఫర్,కార్టూనిస్టు వంటి అన్ని కేటగరీ ల పాత్రికేయులు, దిన,వార,మాస పత్రికలు, ఛానళ్ళు,పోర్టల్ లలో పనిచేసే వారందరూ దీనికి అర్హులు.
పెన్షన్ పొందుతూ జర్నలిస్ట్ చనిపోతే, జీవిత భాగ స్వామి కి నెలకు మూడు వేలు రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తారు. బీహార్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ తో పాటు దేశంలోని పాత్రికేయ సంఘాలు ఈ పథకాన్ని స్వాగతించాయి.
జర్నలిస్ట్ బుద్డ మురళి ఈ వార్త పై ఇలా స్పందించారు …
” దేశం లో కొన్ని రాష్ట్రాలు జర్నలిస్ట్ లకు పెన్షన్ అమలు చేస్తున్నాయి మన రాష్ట్రం లో ఎలా ఉంటే బాగుంటుందో అల్లం నారాయణ బృందం ఓ నివేదిక తయారు చేసింది ప్రభుత్వానికి ఇచ్చిందో లేదో తెలియదు సీరియస్ గా ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది .”
అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఆదర్శ ముఖ్యమంత్రులుగా దూసుకుపోతున్న కేసీఆర్, వైఎస్ జగన్లు కూడా ఈ దిశగా ఆలోచించి పాత్రికేయ కుటుంబాలకు ఆనందం కల్గించాలని తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు కోరుతున్నారు.