విజయ్ సేతుపతి - త్రిష జంటగా తమిళంలో తెరకెక్కిన '96' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆ సినిమాను కన్నడలో '99' పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా మంచి వాసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో నిర్మాత 'దిల్' రాజు .. తమిళంలో ఈ సినిమాను రూపొందించిన ప్రేమ్ కుమార్ నే దర్శకుడిగా తీసుకుని, 'జాను' టైటిల్ తో తెలుగు రీమేక్ చేయించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించన ఈ చిత్రంలో శర్వానంద్, సమంతలు జంటగా కలిసి నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్తో ముందుకెళ్తున్నది. సినీ విమర్శకులు కూడా మూవీపై సానుకూల కథనాలు వెల్లడించడంతో ఫీల్గుడ్ సినిమాగా టాక్ను సంపాదించుకొన్నది. ఈ సినిమాలో శర్వానంద్, సమంతల యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. మరియు సినిమాలో స్కూల్ టైంలో ఉన్న జాను, రామ్ పాత్రల్లో చేసిన పిల్లలు కూడా ప్రేక్షకులను చక్కగా ఆకట్టుకున్నారు. ఇక తమిళ చిత్రానికి సంగీతాన్ని అందించిన గోవింద్ వసంతనే ఈ సినిమాకి బాణీలు కట్టాడు. ఇదిలా ఉంటే.. ఈరోజే వెండితెర మీదకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త తెలుస్తుంది.
ఈ చిత్రం బుల్లితెర హక్కులను తెలుగు టాప్ ఛానెల్ ఒకటి దక్కించుకున్నట్టు సమాచారం.ఈ చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను “స్టార్ మా” ఛానెల్ వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.అయితే డిజిటల్ హక్కుల విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఇక అధికారిక ప్రకటన ఒకటే రావాల్సి ఉంది. కాగా, సినిమా విడుదలైన తక్కువ సమయంలోనే శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడం విశేషం. అలాగే సాటిలైట్ హక్కులను దక్కించుకున్న స్టార్ మా కొన్ని రోజుల తర్వాత టెలికాస్ట్ చేస్తున్నట్టు సమాచారం.