చంద్రుడిపైకి ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం ఇస్రో తీవ్రంగా కృషి చేస్తోంది. విక్రమ్ ల్యాండర్‌ని అన్వేషించే పనిలో ఇస్రోకు తోడుగా అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా రంగంలోకి దిగింది. విక్రమ్‌ ఆచూకీ కోసం డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ సెంటర్లు, జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ ద్వారా నాసా రేడియో సంకేతాలు పంపుతోంది. 


జాబిల్లి ఉపరితలంపై ఉలుకూపలుకూ లేకుండా ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చిట్టచివరి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసాను రంగంలోకి దించింది. మన ల్యాండర్‌తో అనుసంధానమయ్యేందుకు ఆ సంస్థ సంకేతాలను పంపుతోంది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ తన డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌లోని భూ కేంద్రాల ద్వారా విక్రమ్‌కు రేడియో తరంగాలను పంపింది. దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్‌, స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఉన్న నాసా డీఎస్‌ఎన్‌ కేంద్రాల నుంచి 12 కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను జాబిల్లి మీదకు ప్రసరింప చేస్తోంది. భూ కేంద్రంతో కమ్యూనికేషన్‌ సాగించేలా ల్యాండర్‌ను ప్రేరేపించడం దీని ముఖ్య ఉద్దేశం. 


సుదూరపు విశ్వంలోని వ్యోమనౌకలు కనీసం ఏదో ఒక కేంద్రంతో సంబంధాలను కొనసాగించేలా చూడటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు సౌర కుటుంబం అంచుల వరకూ కమ్యూనికేషన్‌ సాగించగలవు. ఆ కేంద్రాల్లోని భారీ యాంటెనాలతో  ఏకకాలంలో అనేక వ్యోమనౌకలతో కమ్యూనికేషన్‌ను సాగించవచ్చు. మరోవైపు రోజులు గడిచేకొద్దీ ల్యాండర్‌ పునరుద్ధరణ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. జాబిల్లిపై 14 రోజుల పగటి సమయం ఈ నెల 20-21తో ముగుస్తుంది. ఆ తర్వాత విక్రమ్‌లోని సౌర ఫలకాలకు శక్తి అందదు. ఆ పరిస్థితుల్లో వ్యోమనౌకపై ఆశలు వదులుకోవాల్సిందే.


మరోవైపు జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న నాసా ఆర్బిటర్‌ లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ ఈ నెల 17న విక్రమ్‌ ఉన్న ప్రదేశం వద్దకు వెళ్తుంది. అప్పుడు ఆ ప్రాంతాన్ని చిత్రీకరించి, ఇస్రోకు అందజేస్తామని నాసా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వాటిలో ల్యాండర్‌ జాడ కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలు ఇస్రోకు అందాయని, ల్యాండర్‌ ఆకృతి చెక్కుచెదరకుండా ఉందని అందులో తేలినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. విక్రమ్‌ కోసం గాలింపు జరుగుతున్న క్రమంలో నాసాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన నిపుణులు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ ఛైర్మన్‌ కె.శివన్‌తో చర్చలు జరిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: