చంద్రుడి మీదకు ల్యాండర్‌ను ఎలాగైనా సురక్షితంగా దించాలనే కసితో ఉంది ఇస్రో. చంద్రయాన్-3 ప్రయోగం కోసం సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పని ప్రారంభించింది. 2020 నవంబర్ ను టార్గెట్ గా పెట్టుకుంది. 


ఇటీవలే చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో.. చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధపడుతోంది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-2 ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత దాని జాడ కనిపించలేదు. నాసా కూడా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం ప్రయత్నించింది. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఇస్రో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 


చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రో ఇప్పటికే పని ప్రారంభించిందని సమాచారం. 2020 నవంబర్‌ లక్ష్యంగా ఇస్రో పని చేస్తోందని తెలుస్తోంది. చంద్రయాన్-3 కోసం కమిటీని ఏర్పాటు చేసిన ఇస్రో.. అక్టోబర్ నుంచి నాలుగు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించింది. చంద్రయాన్-2 ఆర్బిటార్ బాగానే పని చేస్తుందని ఇస్రో తెలిపింది. తదుపరి మిషన్‌లో కేవలం ల్యాండర్, రోవర్‌ను మాత్రమే చంద్రుడి మీదకు పంపే అవకాశం ఉంది. దీని వల్ల మిషన్ ఖర్చు మరింత తగ్గుతుంది.


విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 300 మీటర్ల ఎత్తులో ఉన్నంత వరకూ చంద్రయాన్-2 వ్యవస్థ సక్రమంగానే పనిచేసింది. ఆ తర్వాతే ల్యాండర్ చందమామ ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో చంద్రయాన్-3లో ల్యాండర్‌ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా చూడటంపై ఇస్రో మరింత శ్రద్ధపెట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత చంద్రయాన్‌-3కి సంబంధించి నివేదికను తయారు చేయాలని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ నేతృత్వంలోని కమిటీని ఇస్రో అడిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది చివరి నాటికి మిషన్‌ను సిద్ధం చేయడానికి ఈ కమిటీకి ఇస్రో మార్గదర్శకత్వం చేసింది. వచ్చే ఏడాది నవంబర్‌ ప్రయోగానికి సరైన సమయమని ఇస్రో భావిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: