వచ్చే ఏడాది నవంబర్‌లో చంద్రయాన్-3 ప్రయోగమే లక్ష్యంగా ఇస్రో  సన్నద్ధం అవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక దశలో విక్రమ్ ల్యాండర్ వేగంగా దూసుకెళ్లి చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం ఇప్పటి వరకూ ఇస్రో, నాసా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈసారి ఎలాగైనా ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలం మీద దింపాలన్న పట్టుదలతో ఉన్న ఇస్రో..చందమామను దాదాపుగా అందుకున్నంత పని చేసిన విక్రమ్ ల్యాండర్ చివరి సెకన్లలో క్రాష్ ల్యాండింగ్ కావడం శాస్త్రవేత్తలతోపాటు ప్రతి భారతీయుణ్ని కలచివేసింది. ల్యాండర్ ఇలా నియంత్రణ తప్పడానికి కారణాలేంటని ఇస్రో అన్వేషిస్తోంది.

ఇస్రో అంతర్గత నివేదిక ప్రకారం.. సాఫ్ట్‌వేర్ తప్పిదమే చంద్రయాన్-2 విఫలం కావడానికి కారణమని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ వైఫల్యం కారణంగానే విక్రమ్ ల్యాండర్ చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టిందని ఇస్రో భావిస్తోంది. చందమామ ఉపరితలం మీద ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా ఇస్రో చంద్రయాన్‌-2ను రూపొందించింది. కానీ ఉపరితలానికి 500 మీటర్ల దూరంలో అది నియంత్రణ తప్పి క్రాష్ అయ్యింది. ట్రయల్ దశలో సాఫ్ట్‌వేర్ బాగానే పని చేయడంతో.. ఈ అవాంతరాన్ని ఇస్రో అంచనా వేయలేకపోయింది.

విక్రమ్ ల్యాండర్ 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5 కిలోమీటర్ల ఎత్తుకు బాగానే కిందకు దిగింది. దీన్ని రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఆ తర్వాతిది ఫైన్ బ్రేకింగ్ స్టేజ్. ఇదే చివరి దశ కూడా. ఈ దశలో ల్యాండర్ ఇబ్బందులు ఎదుర్కొంది. థ్రస్టర్‌ను ఆపరేట్ చేసి ల్యాండర్ వేగాన్ని సెకను 146 కి.మీ.కు తగ్గించాలి. కానీ ప్రయాణించాల్సిన మార్గం నుంచి పక్కకు మళ్లిన ల్యాండర్.. ల్యాండింగ్ కావాల్సిన ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో క్రాష్ అయ్యింది. దీంతో అందులోని మెషినరీ దెబ్బతింది. ఫలితంగా ల్యాండర్‌‌తో అనుసంధానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 


లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ వి.నారాయణన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఇస్రో అంతర్గత కమిటీ చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించింది. ఈ కమిటీకి నాసా కూడా తన దగ్గరున్న సమాచారాన్ని అందించింది. ఈ తప్పిదాలను సరిచేసుకొని వచ్చే ఏడాది నవంబర్లో చంద్రయాన్-3 ప్రయోగం దిశగా ల్యాండర్, రోవర్ల రూపకల్పన కోసం ఇస్రో పని ప్రారంభించింది. ఈ ల్యాండర్, రోవర్.. ఇప్పటికే చంద్రుడి చుట్టూ తిరుగుతోన్న ఆర్బిటార్‌తో అనుసంధానం అవుతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: