ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ రంగంలో ముఖ్యంగా మన ఇంట్లో సాధారణ గృహోపకారణంగా చెప్పబడే టివిల్లో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ మార్కెట్ లోకి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక రాను రాను టివిల సైజులు పూర్తిగా తగ్గుతూ ఎంతో సన్నగా నాజూగ్గా దర్శనం ఇస్తున్నాయి. ఇక ఇప్పటికే మార్కెట్ లోకి డిజిటల్ విప్లవంలో భాగంగా ఆండ్రాయిడ్ టివిలు విరివిగా లభ్యం అవుతున్నాయి. ఇక మెల్లగా కస్టమర్లు కూడా ఈ తరహా టివిల వాడకంపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. సాధారణంగా మనం నిత్యం చూసే కేబుల్ టివి ఛానల్స్ తో పాటు యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ వంటి ఓటిటి యాప్స్ ని కూడా డౌన్ లోడ్ చేసుకోవడం లేదా, క్రోమ్ క్యాస్ట్ ద్వారా కనెక్ట్ చేసి చూసుకోవడం ఈ ఆండ్రాయిడ్ టివిల ప్రత్యేకత.
అయితే ఇటీవల రిలీజ్ చేసిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ శాంసంగ్ వారి టీవీల్లో ఇకపై నెట్ ఫిక్స్ ప్రసారాలు రావంటూ నేడు నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి ఒక షాకింగ్ ప్రకటన రిలీజ్ అయింది. వివరాల్లోకి వెళితే, శాంసంగ్ స్మార్ట్ టీవీ వినియోగదారులు, రేపు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ‘నెట్ఫ్లిక్స్’ సినిమాలను, ఇతర కార్యక్రమాలను చూడడం కుదరదని, కొన్ని రకాల సాంకేతిక పరిమితుల వల్ల, ముఖ్యంగా పాత మోడళ్లలో తమ ప్రసారాలను చూడలేరని నెట్ఫ్లిక్స్ యాజమాన్యం పేర్కొంది. తమ పాస్వర్డ్ షేరింగ్ను పరిమితం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల తక్కువ సంఖ్యలోని వినియోగదారులపైనే ప్రభావం ఉంటుందని యాజమాన్యం తెల్పింది.
అయితే అటువంటి వారు ఇకపై తమ కార్యక్రమాలను చూడాలంటే సరైన సెటాప్ బాక్స్ను అమర్చుకోవాలని సూచించింది. కానీ ఏయే మోడళ్లలో తమ కార్యక్రమాలు రావో నెట్ఫ్లిక్స్ సంస్థ మాత్రం వివరంగా వెల్లడించలేదు. కాగా ఆపిల్ టీవీ, క్రోమ్క్యాస్ట్, గేమ్ కన్సోల్స్తోపాటు మరికొన్ని ఇతర సెటాప్ బాక్సులను ఉపయోగించి తమ కార్యక్రమాలను చూడవచ్చని తెలిపింది. కాగా దీనిపై ఇంకా శాంసంగ్ టీవీల యాజమాన్యం మాత్రం స్పందించాల్సి ఉంది. ఇక ఈ మ్యాటర్ నేడు పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో, పలువురు శాంసంగ్ టివిల వినియోగదారులు కొంత అయోమయ స్థితిలో ఉన్నారు....!!