సివిల్‌ ఏవియేషన్‌ (పౌర విమానయాన) చట్టం ప్రకారం మన దేశంలో కనుచూపు మేర వరకు ఎగిరే డ్రోన్ల తయారీకి మాత్రమే అనుమతి ఉంది. అంటే డ్రోన్‌ ఆపరేటర్‌ తన కనుచూపు మేర వరకు మాత్రమే డ్రోన్లను ఆకాశంలో నడుపుతారు. కాగా నిఘా, వస్తు రవాణా అవసరాలకు ఆకాశంలో ఎంత దూరమైనా (కనుచూపు మేర దాటి–బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌ సైట్‌) ప్రయాణించే డ్రోన్ల తయారీ దిశగా భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బియాండ్‌ విజువల్‌ లైన్‌ ఆఫ్‌సైట్‌ (బీవీఎల్‌ఓఎస్‌) డ్రోన్లకు కూడా అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనను కొన్నేళ్లుగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటి తయారీకి గత మే నెలలో సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బీవీఎల్‌ఓఎస్‌ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ ఏడాది మే నెలలో నోటిఫై చేసింది. దాంతో పలు సంస్థలు బీవీఎల్‌ఓఎస్‌ (కనుచూపు మేర దాటి ప్రయణించే) డ్రోన్ల తయారీ దిశగా సన్నాహాలు చేపట్టాయి. ఈ ఏడాది జూన్‌లో పలు కంపెనీలు ఈ తరహా డ్రోన్ల తయారీకి దరఖాస్తు చేశాయి. వాటిలో ఏడు కంపెనీలకు డీజీసీఏ ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది.


వైద్య, ఆరోగ్య ఉత్పత్తులను ఇంటికి డ్రోన్‌ల ద్వారా పంపే వినూత్న వ్యవస్థను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ - హైదరాబాద్‌(ఐఐపీహెచ్‌-హెచ్‌) పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. రియల్‌ టైమ్‌ అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ మాడ్యులర్‌ లాజిస్టిక్స్‌ సిస్టమ్‌గా పిలిచే ఈ వ్యవస్థ ద్వారా.. విదేశాల్లో ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల కంటే చాలా చవకగా ఉత్పత్తులను రవాణా చేయవచ్చు. ఈ విషయాన్ని ఐఐపీహెచ్‌ హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ సురేశ్‌ మునిస్వామి వెల్లడించారు. ప్రస్తుతం ఐఐపీహెచ్‌ డ్రోన్‌ డిజైన్‌ను రూపొందించే పనిలో ఉంది. డ్రోన్‌ ఎంత దూరం ప్రయాణించాలి? ఎంత బరువు మోసుకుపోవాలి? మొదలైన అంశాలను ఇంకా నిర్ధారించలేదు.


వ్యూహాత్మక, నిఘా, వస్తు రవాణా అవసరాల కోసం బీవీఎల్‌ఓఎస్‌ డ్రోన్లను ఉపయోగించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రధానంగా వ్యూహాత్మక, నిఘా అవసరాల నిమిత్తం సైన్యం, పోలీసులకు వీటిని అందజేయాలన్నది ప్రధాన ఆలోచన. ట్రాఫిక్‌ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా తదితర అవసరాల కోసం దేశంలోని పోలీసులకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. 


వస్తు రవాణాకు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉంది. చిన్న చిన్న ప్యాకేజీలను తక్కువ వ్యయంతో.. తక్కువ సమయంలో రవాణా చేయొచ్చన్నది అధికారుల ఆలోచన. ప్రధానంగా విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే నగరాల్లో వస్తు రవాణాకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు. బీవీఎల్‌వోఎస్‌ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించిన అనంతరం బీవీఎల్‌వోఎస్‌ అసెస్‌మెంట్, మానిటరింగ్‌ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే డీజీసీఏ దీనిపై కేంద్రానికి సిఫార్సులను సమర్పిస్తుంది. అనంతరం కేంద్ర హోం, రక్షణ, పౌర విమాన యాన శాఖలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: