ఇప్పటికే ఏజీఆర్ వివాదంతో కష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు మరో గట్టి దెబ్బ తగిలింది. దేశంలోనే మూడో పెద్ద మొబైల్ సర్వీసు ప్రొవైడర్ అది. అయినా బాకీలు కట్టలేకపోతోంది. ఓ వైపు చౌక ధరలతో అంబానీ కంపెనీ జియో నుంచి వస్తోన్న పోటీని తట్టుకోలేక సతమతమవుతున్న ఈ కంపెనీకి, ఏజీఆర్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో తల ప్రాణం తోకకు వచ్చినట్టైంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ వొడాఫోన్ ఐడియాకు డౌన్ రేటింగ్ను కొనసాగించింది.
ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సిన అవకాశం ఉన్నందున కంపెనీ ఆర్ధిక రిస్క్ ప్రొఫైల్లో గణనీయమైన క్షీణత ఉంటుందని అంచనా వేసింది. ఏజీఆర్ వివాదానికి ముందు బీబీబీగా ఇచ్చిన ర్యాంకును బీబీబీ మైనస్కు తగ్గించింది. వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 3,500 కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లపై క్రిసిల్ తన రేటింగ్ను తగ్గించిందని తెలిపింది. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ .53,038 కోట్లు చెల్లించాల్సి వుంది.
అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలను జనవరి 23నాటికి చెల్లించాల్సిందేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దేశీయ టెలికాం కంపెనీలు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై టెల్కోలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించగా విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. దీంతో.. సుప్రీం కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వచ్చేదాకా ఏజీఆర్ బాకీలను కట్టలేమంటూ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా డాట్కు తెలియజేశాయి.