ఇటీవల కాలంలో చాలా మంది స్మార్ట్ఫోన్లను ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఫోన్లు మాత్రం కాదు.. ఏది కావాలన్నా అన్లైన్లోనే బుక్ చేసేకుంటున్నారు. దీంతో మొత్తం ఆన్లైన్ మయం అయిపోయింది. దీన్నే కొందరు అదునుగా తీసుకుని మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసుకునేవారు ఖచ్చితంగా ఇప్పుడు చేప్పే విషయాలు తెలుసుకోవాలి. ఈ-కామర్స్ వెబ్ సైట్లలో ఉండే రివ్యూలను పూర్తిగా నమ్మడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే రివ్యూలు రాసే వారికి కూడా కొన్ని బ్రాండ్లు డబ్బులిచ్చి వారికి అనుకూలంగా రివ్యూలు రాయించుకుంటాయి.
కాబట్టి కేవలం రివ్యూలు మాత్రమే నమ్మకుండా అన్నీ చూసుకోవాలి. మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొంటున్నారంటే.. ఆ ఫోన్ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి. బ్యాటరీ కోసం ఒక ఫోన్, పనితీరు కోసం ఒక ఫోన్ అలా కొనుగోలు చేయకూడదు. ఫోన్ కొనేటప్పుడు ఏదో ఒక ఫీచర్ ను మాత్రమే కాకుండా అన్ని ఫీచర్లను చూసుకుని కొనుగోలు చేయాలి. సెలబ్రిటీ పోస్టులను నమ్మి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయకండి. వాటిని కూడా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఇచ్చే అడ్వర్టయిజ్ మెంట్లుగానే భావించాలి.
ఫ్లాష్ సేల్స్ ద్వారా ఒకే సేల్ లో ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో ఏ బ్రాండ్ కూడా ప్రకటించదు. అది పది స్మార్ట్ ఫోన్లు కావచ్చు, పది వేలు స్మార్ట్ ఫోన్లు కావచ్చు. కాబట్టి ఒక బ్రాండ్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు ఫ్లాష్ సేల్ లో పూర్తిగా అమ్ముడుపోయాయంటే వాటికి ఆ స్థాయిలో డిమాండ్ ఉందని అస్సలు నమ్మకూడదు. ఫలానా మొబైల్ బ్రాండ్ దేశంలో నంబర్ వన్ అని ఫోన్లను ఎంచుకోకూడదు. అన్నీ ఫీచర్లను చెక్ చేసుకున్న తర్వాతే మనం ఆన్లైన్లో ఫోన్ బుక్ చేసుకోవాలి.