యూట్యూబ్… మొబైల్ వాడకం ఎంత పెరిగిందో యూట్యూబ్ వినియోగం కూడా అంతే పెరిగింది. చదువుకు సంబంధించిన అంశాల దగ్గర్నుంచి ఏదైనా నేర్చుకోవడం, మ్యూజిక్, ఆరోగ్యం, వంటలు.. ఇలా రకరకాల అవసరాల కోసం నెటిజన్లు యూట్యూబ్ను ఆశ్రయిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం లాంటి స్థానిక భాషల్లో వీడియోలు చూడటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అయితే ఇటీవలి కాలంలో అసత్యపు వార్తలు, తప్పుడు ప్రచారాలు పెరిగిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా వీడియో దిగ్గజం యూ ట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.
నిరాధార వార్తలను అరికట్టేందుకు, ఏ విధమైన ఎన్నికలు జరిగినా, వాటికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారనిగానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే దాన్ని తొలగిస్తామని ఆ సంస్థ చెప్పింది. ఇందుకోసం ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఆ వీడియోలను ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్లు నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్ను మార్చనున్నట్లు తెలిపింది. వార్తా సమాచారానికి విశ్వసనీయ సోర్స్గా యూట్యూబ్ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కసరత్తు ముమ్మరం చేశామని తెలిపారు.
అదే సమయంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు బహిరంగ వేదికగా మలిచేందుకు కృషి చేస్తున్నామ’ని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ లెస్లీ మిల్లర్ పేర్కొన్నారు. ఆన్లైన్ వివక్ష తొలగించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు దుర్వినియోగంతో వీక్షకులను తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించనున్నట్టు గత నెలలో ఫేస్బుక్ ప్రకటించింది. అలాగే మరీ రాంగ్ మెసేజ్లు నింపుతుంటే మాత్రం ఛానెల్ బ్లాక్ చేసే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏదేమైనా యూట్యూబ్ ఛానల్స్ వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.