భారత్లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం సంస్థలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత చౌకగా మొబైల్ డేటా లభిస్తున్నది భారత్లోనే. దాంతో, గడచిన నాలుగేళ్లలోనే అనేక మంది కొత్తగా ఇంటర్నెట్ వాడకం ప్రారంభించారు. డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కో ఇంటర్నెట్ వినియోగదారుడు నెలకు సగటున పది జీబీలకు పైనే డేటా వాడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
కొన్నాళ్ల కిందట భారత్ లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఉచితంగా ఇంటర్నెట్ అందించేందుకు గూగుల్ సంస్థ 'గూగుల్ స్టేషన్' పేరిట ఉచిత వైఫై తీసుకువచ్చింది. రైల్టెల్ సహకారంతో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించింది. అయితే భారత్ లో ఇంటర్నెట్ ధరలు చాలా చవకగా ఉన్న నేపథ్యంలో ఉచితంగా వైఫై అందించడంలో అర్థంలేదని గూగుల్ భావిస్తోంది. అందుకే రైల్వే స్టేషన్ ల్లో 'గూగుల్ స్టేషన్' సేవలు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గూగుల్ ఐదేళ్ల కిందట భారత్ తో పాటు అనేక దేశాల్లో 'గూగుల్ స్టేషన్' సేవలు ప్రారంభించింది.
అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు డేటా ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉంటున్నాయని, ముఖ్యంగా భారత్ లో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో డేటా లభ్యమవుతోందని గూగుల్ వర్గాలంటున్నాయి. భారత్ లో సగటున ఓ యూజర్ నెలకు 10 జీబీ డేటా వినియోగిస్తున్నాడని ట్రాయ్ గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో, గూగుల్ స్టేషన్ ను ఇంకా కొనసాగించడం అనవసరమని భావిస్తున్నట్టు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ గుప్తా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఏదేమైనా భారత్లో గూగుల్ స్టేషన్ సేవలు ఉండవన్నమాట.