కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ఈ పేరు చెబితేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. కరోనా వైరస్ వచ్చినప్పుడు అది కేవలం ఒక్క చైనాకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ, ఈ మహమ్మారి ఒక్కో దేశాన్నే దాటుకుంటూ ప్రస్తుతం భారత్ వరకూ పాకేసింది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది. వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా... పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది.
అలాగే... రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది. ఇక ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వేల మంది మృతి చెందారు. అంతేకాదు రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది తప్ప తరగడం లేదు. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ ఫేస్బుక్పై పడింది. : సోషల్ మీడియా ‘ఫేస్బుక్’ లండన్లోని తన కార్యాలయాన్ని శుక్రవారం నుంచి మూసివేసింది. మళ్లీ కార్యాలయాన్ని తెరిచే వరకు ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించింది.
ఫేస్బుక్ ఉద్యోగుల్లో ఒకరికి కోవిడ్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు హామీ ఇస్తామని తెలిపింది. డాక్టర్లు, ప్రభుత్వాల సూచనలు, సలహాలు పాటిస్తామని తెలిపింది. ఫేస్బుక్ కార్యాలయం భవనంలో వైరస్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వైద్య పరంగా శుద్ధి కార్యాక్రమాన్ని చేపడుతున్నామని, అది పూర్తయ్యాక మళ్లీ కార్యాలయాన్ని తెరుస్తామని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.