చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పోకు మార్కెట్‌లో ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒప్పో సైతం ఎప్ప‌టిక‌ప్పుడు యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తూ అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేస్తుంది. ఇక తాజాగా కూడా ఒప్పో మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. ఒప్పో ఏస్ 2 పేరిట లాంచ్ కానున్న ఈ ఫోన్ ఏప్రిల్ 13వ తేదీన విడుదల అవ్వ‌నుంది. అయితే ముందుగా చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. మ‌రియు త్వ‌ర‌లోనే ఇత‌ర మార్కెట్ల‌లో కూడా విడుద‌ల కానుంది.

 

ఇక అందుతున్న లీకులు ప్ర‌కారం.. ఒప్పో ఏస్2 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించనున్నారు.  5జీని సపోర్ట్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలను కూడా అందించారు. 

 

అలాగే సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించనున్నారు.  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇందులో 1955 ఎంఏహెచ్ సామర్థ్యమున్న డ్యూయల్ బ్యాటరీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంటే మొత్తం బ్యాటరీ సామర్థ్యం 3910 ఎంఏహెచ్ అన్న‌మాట‌. కాగా, గతేడాది అక్టోబర్ లో లాంచ్ అయిన ఒప్పో రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: