ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి దండయాత్ర.. ప్రస్తుతం ప్రపంచదేశాలను చుట్టేసింది. ఇక ఈ కరోనా భూతానికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. అలాగే కరోనాను అడ్డుకునేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించడంతో.. ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ సమయంలో ఆన్లైన్ గేమ్స్కు డిమాండ్ బాగా పెరిగిపోయింది.
ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు రోజులో ఎక్కువ శాతాన్ని ఆన్లైన్ గేమ్స్కే అంకితం చేస్తున్నారు కొందరు. పిల్లలు కార్టూన్ నెట్వర్క్తో పాటు వీడియో గేమింగ్కు బానిసలుగా మారుతుంటే, పెద్దలు, ఉద్యోగులు గృహిణులు సైతం ఆ ఆటల్లో లీనమైపోతున్నారు. అయితే ఇటీవల దీనిపై కొన్ని సర్వేలు నిర్వహించగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందులో భాగంగా.. పిల్లలైనా, పెద్దలైనా ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల వారికి శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదురవుతున్నాయని తేలింది. ముఖ్యంగా యాక్షన్ గేమ్స్కి బానిసలం అవ్వడం వల్ల వారి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు.. డిప్రెషన్, టెన్షన్ లెవెల్స్ పెరిగాయని అంటున్నారు.
ఇక సాధారణంగా ఎంటర్టైన్మెంట్ కోసమే ప్రజలు ఆన్లైన్ గేమ్స ఆడుతున్నారు. కానీ, ఆ గేమ్స్ అందరికీ ఆనందాన్ని ఇవ్వటలేదు. వర్చువల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది... ఐడెంటిటీ థెఫ్ట్, సైబర్ బుల్లీయింగ్, ఫిషింగ్, క్రెడిట్ కార్డ్ థెఫ్ట్ వంటి ఎన్నో నేరాలకు దారితీస్తోంది. దీని వల్ల చాలా ఎంతో నష్టపోతున్నారు. ఇక ఫోన్ పట్టుకుని నిద్రాహారాలు మాని వీడియో గేమ్లు ఆడేవారు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు. వారి జీవనశైలి మిగిలిన వారిపై ప్రభావం చూపించడమే కాకుండా పెద్దల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. అంతేకాదు, మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే కేసుల్లో వీడియో గేమింగ్ వ్యసనంతో అనారోగ్యం బారిన పడిన వారే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. అందుకే ఆన్లైన్ గేమ్స్ ఆడేవారు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.