వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్కు పోటీగా రిలయన్స్ జియో ప్రకటించిన 'జియోమీట్' అందుబాటులోకి వచ్చేసింది. జూమ్ తదితర వీడియో కాలింగ్ యాప్ లకు ప్రత్యామ్నాయంగా, 'జియో మీట్' పేరిట హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను విడుదల చేసింది. ఇందులో ఇన్వైట్ కోడ్స్ అవసరం లేదని, ఇదే దీని ప్రత్యేకతని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 100 మంది వరకూ ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చని, తమతమ స్క్రీన్స్ షేర్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఈ యాప్ పూర్తిగా ఉచితమని వెల్లడించింది. ఏప్రిల్లో నాలుగో క్వార్టర్ సందర్భంగా జియో ఈ యాప్ను ప్రకటించగా, తాజాగా ఇప్పుడు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది.
జియోమీట్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. విండోస్, మ్యాక్కు కూడా జియోమీట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ కొంతకాలంపాటు బీటా వెర్షన్లో అందుబాటులో ఉండనుంది.ఫుల్ హెచ్ డీ రిసొల్యూషన్ తో వీడియో కాన్ఫరెన్స్ అందుబాటులోకి వచ్చిందవి. దీని డెస్క్టాప్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ లో పంపించే లింక్స్ ఆధారంగా పాల్గొనాలి. దీని వల్ల డెస్క్టాప్లో ఇంటర్నెట్ బ్రౌజర్ తో మాత్రమే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకోనవసరం లేదు. జియో మీట్ లో వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్ను టైమ్ సెట్ చేసుకుని.. ఆ లింక్లను ఇతరులకు షేర్ చేయొచ్చు. దీని ద్వారా వారు కూడా అదే టైమ్ కి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనచ్చు.
ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ కావొచ్చు. గూగుల్ మీట్, జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చైనాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన 59 యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ యాప్స్ కు సంబంధించి గూగుల్ కీలక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ లోనే ఉంచామని... అయితే ఇండియాలో అందుబాటులో లేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశామని వెల్లడించింది.