ఈ మద్య ప్రతి ఒక్కరికీ ఉదయం నిద్ర లేచింది మొదలుకుని రాత్రి మళ్లీ నిద్రపోయే వరకు అంతా ‘స్మార్ట్’గానే కాలం గడిచిపోతోంది. కాలానుగుణంగా టెక్నాలజీ కూడా కొంత పుంతలు తొక్కుతోంది. ఇందుకోసం మొబైల్ కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ఫోన్లను సరికొత్త ఫీచర్స్తో అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సెక్యూరిటీ కోడ్, వేలిముద్ర స్కాన్, వాయిస్ స్కాన్ల నుంచి ఫేస్ రీడింగ్ స్కాన్ వరకు వచ్చాయి. త్వరలో అరచేతి గీతలను స్కాన్ చేసి ఫోన్ అన్లాక్ చేసే సదుపాయాన్ని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఫీచర్ శాంసంగ్లోని అన్ని స్మార్ట్ఫోన్లకు పనిచేస్తుందా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కాగా ఇప్పటికే శాంసంగ్ కంపెనీ.. ప్యాటర్న్, పిన్, వేలి ముద్ర, కంటి స్కానింగ్, ఫేస్ స్కానింగ్ చేసి ఫోన్ లాక్ను తీసుకునేందుకు వీలు కల్పించింది.ఇటీవల ఆపిల్ టెన్లో అందుబాటులోకి వచ్చిన ఫేస్రీడింగ్ అన్లాక్ టెక్నాలజీకి, అరచేతి గీతల రీడింగ్ స్కాన్ను శాంసంగ్ కౌంటర్గా ప్రవేశపెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే మడత పెట్టగల స్మార్ట్ఫోన్లను కూడా శాంసంగ్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.ఈ ఫోన్లను 2018లో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.