ఈ మద్య ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. చాలా మంది ఆ టెక్నాలజీని ఆర్థిక పరంగా ఉపయోగించుకుంటున్నారు. ఇక ఫేస్ బుక్ లో ప్రకటన ద్వారా చాలా మంది బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత మంది యూజర్లను తమ సొంతం చేసుకోవచ్చు. క్లిక్-టూ-వాట్సాప్ పేరు మీద ఫేస్బుక్ తాజాగా సరికొత్త ఫీచర్ను ప్రారంభించింది.
ఈ ఫీచర్ ద్వారా 100 కోట్ల మంది వాట్సాప్ యూజర్లను అడ్వర్టైజర్లు కనెక్ట్ చేసుకోవచ్చు. శుక్రవారం ఈ విషయాన్ని టెక్క్రంచ్ ద్వారా ఫేస్బుక్ ధృవీకరించింది. ఈ ఫీచర్ను క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు కూడా తెలిపింది. మొదట దీన్ని ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియాలో పలు ప్రాంతాల్లో ప్రారంభించింది. ఫేస్బుక్ ప్రకటనల కోసం క్లిక్-టూ-వాట్సాప్ బటన్ను యాడ్ చేయడం ద్వారా, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను చాలా వేగంగా ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
ప్రస్తుతం 10 లక్షల పేజీలు, వాట్సాప్ నెంబర్లను తమ పోస్టులకు జతచేర్చాయి. యూజర్లు ఉత్పత్తుల గురించి సంభాషణ జరుపడానికి తమ కాంటాక్ట్స్లో వ్యాపారస్తుల వాట్సాప్ నెంబర్లను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ అచ్చం గతేడాది నవంబర్లో లాంచ్ చేసిన క్లిక్-టూ-మెసెంజర్ బటన్ మాదిరే ఉంది.