ప్రైవేట్ మొబైల్ ఆపరేటర్లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సేవల్ని విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వైరా, జడ్చర్లలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని బీఎస్ఎన్ఎల్ హైదరాబాద్ ప్రిన్సిపల్ మేనేజర్ రాంచంద్ స్పష్టంచేశారు. అంతే కాదు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన 3జీ సేవల్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
మేడారం జాతర జరిగే ప్రాంతంతో పాటు ఆ రహదారి వెంబడి 3జీ బీటీఎస్లు 20 చోట్ల ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు.