భారత దేశంలో టెక్నాలజీ పెరుగుతున్న కొలది సోషల్ మాద్యమాల జోరు బాగా పెరిగిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు ఎక్కువగా వాట్సాప్ యాప్ ని వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వాట్సాప్ లో ఎన్నో కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. తాజాగా వాయిస్ కాలింగ్, ఆ తర్వాత వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. అదే గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్. ఇన్ని రోజులు ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ను, గ్రూప్లోని సభ్యులు కలిసి మాట్లాడుకునే విధంగా ఈ కొత్త ఫీచర్ను లాంచ్ చేయబోతుంది.
గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ పేరుతో దీన్ని పరిచయం చేస్తోంది. అయితే ఇది ఆండ్రాయిడ్లోని 2.17.443 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్పై యాప్ కొత్త వెర్షన్ 2.18.39పై కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికారికంగా దీన్ని ప్రవేశపెట్టనప్పటికీ, బీటా యూజర్లకు మాత్రం ఇది అందుబాటులో ఉన్నట్టు డబ్ల్యూబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది.
దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ను కూడా ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. మీరు, మరో వ్యక్తితో పాటు ముగ్గురు సభ్యులు ఈ గ్రూప్ వీడియో కాల్లో మాట్లాడుకునేలా ప్రస్తుతం ఈ ఫీచర్ పనిచేస్తుందని తెలిసింది. అయితే నాన్-బీటా యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు తీసుకొస్తుందో ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.