ఈ మద్య భారత దేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మాద్యమాల వినియోగంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకప్పుడు వ్యక్తుల మద్య సంబంధాలు కొనసాగించాలంటే..ఫోన్ కమ్యూనికేషన్ ఉండేది..కానీ ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత లైవ్ చాటింగ్ ఈజీ అయ్యింది. అంతే కాదు ఫేస్ టూ ఫేస్ వీడియో కాలింగ్ లాంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికి తప్పని సరిగా వాట్సాప్ యాప్ ఉంటుందన్న విషయం తెలిసిందే. వాట్సాప్ వచ్చినప్పటి నుంచి ఫోటోలు, చాటింగ్, వీడియో కాలింగ్ అందుబాటులోకి వచ్చింది. అయితే గత కొంత కాలంగా వాట్సాప్ లో రక రకాల మార్పులు చేర్పులు చేస్తున్నారు.
తాజాగా భారీ స్థాయిలో మార్పిడి జరిగే స్పాం నిరోధానికి సామాజిక అనుసంధాన వేదిక వాట్సాప్ చర్యలకు ఉపక్రమించింది. వేరే వ్యక్తులు ఓ మెసేజ్ను ఫార్వర్డ్ చేసినా, లేదంటే వచ్చిన మెసేజ్ను సదరు వినియోగదారుడే ఇతరులకు ఫార్వర్డ్ చేసినా ‘ఫార్వర్డెడ్ మెసేజ్’ అని దానిపై టాగ్ కనిపించనుంది. వాట్సాప్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వీ2.18.67లో మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు అందులో పర్కొంది.
దీంతో పాటు స్టికర్స్ ఫీచర్ కూడా విండోస్ ఫోన్ బీటాపై స్పాట్ అయింది. ఆండ్రాయిడ్ బీటా యాప్కు కూడా ఇది అందుబాటులోకి వచ్చినట్టు తెలిసింది. వాట్సాప్ ఇటీవలే గ్రూప్ డిస్క్రిప్షన్ అనే ఫీచర్ను ఆండ్రాయిడ్, విండోస్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్ను ఎడిట్ చేసే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది.