ఇంటర్నెట్ – అంతర్జాలం విశ్వాంతరాళాన్ని పిడికిట్లోకి తెచ్చింది. నేడు ప్రపంచం ఒక కుగ్రామం. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అలాంటి అంతర్జాలలో మానవ జాతి జీవితం అద్భుతం అనుకుంటాం కాని అంతకు మించిన ప్రళయం దాగుంది కదా! అదే హ్యాకింగ్. ఈ హ్యాకింగ్ ప్రళయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పలు దేశాల వెబ్సైట్లను హ్యాక్ చేసి అందుండి కీలక సమాచారం కొందరు డబ్బు కోసం హ్యాకింగ్ చేస్తుంటే, మరికొందరు ఇతర దేశాల రహస్య సమాచారాన్ని తెలుసుకోవడానికి హ్యాక్ చేస్తుంటారు.
అయితే ఇలాంటి సమస్యకు పూర్తిగా స్వస్తిచెప్పి హ్యాక్-ప్రూఫ్, సర్వసురక్షిత అంతర్జాలాన్ని తమదేశ ప్రజలందరికి, వ్యవస్థలన్నింటికి శాశ్వితంగా అందించాలన్నదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఆలోచన. ఇందులో భాగం గానే రష్యా వ్యాప్తంగా ఇంటర్నెట్ ను దూరం చేయాలని నిర్ణయించారు. 2021 నాటికి కొత్త సాంకేతిక వ్యవస్థ, విఙ్జానం వినియోగించుకొని నూతన అతి సురక్షిత అంతర్జాలాన్ని తమ దేశ సురక్షితం కోసం తీసుకు రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే చట్టం కూడా చేశారు.
ఇంటర్నెట్కు ప్రత్యామ్నాయంగా దేశీయంగా స్వదేశీయ విఙ్జానం తో మరో రకమైన సాంకేతిక అంతర్జాలాన్ని రూపొందిస్తున్నారు. ఇంటర్నెట్కు బదులుగా రష్యా-నెట్ (రూనెట్) పేరుతో సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా దేశంలోని సర్వర్లన్నింటినీ అనుసంధానించనున్నారు. ఈ నెట్ వర్క్తో సైబర్ దాడుల నుంచి దేశీయ వెబ్ సైట్లను కాపాడవచ్చని రష్యా సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, దేశంలోకి ఏ విధమైన సమాచారం ప్రవేశించాలన్నా(ఎంట్రి) నిర్గమించాలన్నా (ఎక్జిట్) ఈ వ్యవస్థను దాటి వెళ్లాల్సి ఉంటుందని, దేశానికి సంబంధించిన కీలక రక్షణ తదితర రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లకుండా సురక్షితంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగాళ్లు దేశీయంగా హ్యాకింగ్కు పాల్పడితే నిఘా సంస్థ వారిని ఇట్టే పట్టేస్తుంది. అందుకే ఇంటర్నెట్ సేవలను దేశ వ్యాప్తం గా నిలిపివేసి, రూనెట్ వ్యవస్థకు దారి సుగమం చేయాలని పుతిన్ నిర్ణయించారు. 2021 నాటికి దేశంలోని కమ్యునికేషన్ సంస్థలన్నీ ఈ రూ-నెట్ చట్టం పరిధిలో ఉండి నిరంతర సేవలు అందించాలని ఆదేశించారు. రాజు తలచుకుంటే సకాలానికి కానిదేముంది?