ఫేస్ బుక్... ప్రస్తుత కాలంలో ఇది తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారిని వింతగా చూసే రోజులు ఇవి. ఎందుకంటే సామజిక మార్గాలలో అత్యధిక ఆదరణ పొందినది ఎక్కవుగా చెప్పే ఒకే ఒక్క సమాధానం ఫేస్ బుక్. ఫేస్ బుక్ పై ఎన్ని ఆరోపణలు వచ్చిన వాటిని అన్నిటిని దాటుకుంటూ ఎప్పటికప్పుడు తాను ప్రజలకు కొత్తగా ఏదో ఒక ఆప్షన్ ని ప్రజలకు చేరువ చేస్తూ వస్తుంది ఫేస్ బుక్.
ఇప్పటి వరకు ఫేస్బుక్లో మిత్రులు, బంధువుల పోస్టులతో పాటు ఇక పై వార్తలు సైతం కనిపిస్తాయి. ఫేస్ బుక్ అధికారికంగా తెస్తున్న ఈ వార్తలను ప్రత్యేక ఫీడ్ (ట్యాబ్)లో ఉంచుతుంది. ఈ వార్తలను వాల్ స్ట్రీట్ జర్నల్కు చెందిన పబ్లిషర్ న్యూస్ కార్ప్ నుంచి వచ్చేలా చర్యలు చేపడుతుంది ఫేస్ బుక్. రానున్న కొద్ది వారాల్లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా బయటకు రానుంది.
ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ కో ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ ఒక ప్రక్కన పూర్వకంగా తెలిపారు. జర్నలిజం విలువను గుర్తించినందుకు ఫేస్బుక్ కు క్రెడిట్ దక్కుతుందని న్యూస్ కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ థామ్సన్ తన దైన శైలిలో అభివర్ణించారు. ఈ వార్తాసంస్థతో ఉన్న ఒప్పంద విలువ మాత్రం బయటకు తెలియడం లేదు.
ఈ ఫీడ్ లో ఏ వార్తలు టాప్లో ఉండాలో ఒక బృందం నిర్ణయం తీసుకోనుంది. ఇటీవలి కాలంలో ఫేస్బుక్ లో ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతూ పలువురి ప్రాణాలు బలిగొన్న సంగతి తెలిసిందే. ఇటువంటి ఫేక్ న్యూస్ ను అధికారిక వార్తా సంస్థల ద్వారా వచ్చే వార్తలతో అడ్డుకట్ట వేయవచ్చని పలువురు టెక్ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల ధాటికి వార్తా సంస్థలకు వినియోగదారులు రోజురోజుకి కొంత తగ్గుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రెండు సమస్యలకు ఇది పరిష్కార మార్గమని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫేస్బుక్లో యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే పలు పోస్టులు వచ్చినట్లు, యూజర్ ఇంటరెస్ట్ ఆధారంగానే వార్తలు కూడా ప్రత్యేక ట్యాబ్ లో కనిపించ బోతున్నాయి.