అది తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం అంకుశాపూర్ గ్రామం.. ఈ గ్రామానికి సమీపంలోనే అడవి.. ఆ అడవిలో ఒక చెట్టు.. ఎవరో అటుగా వెళ్లగా ఆ చెట్టు కొమ్మకు రెండు దేహాలు వేలాడుతూ కనిపించాయి. అవి యువతి, యువకుడి మృతదేహాలు..! ప్రేమజంట ఆత్మహత్య! ఒక్కసారిగా కలకలం.. ఏం జరిగిందో తెలియదు.. ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.. కలిసి కలకాలం బతకాల్సిన వాళ్లు అర్ధాంతరంగా తనువుచాలించారు. వారి కలల్ని ఎవరు చిదిమేయాలని చూశారో..! వారు కలిసి జీవించేందుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించారో తెలియదుగానీ.. ఈ లోకంలో ఒక్కటిగా జీవించలేకపోవడంతో.. కలిసి ఈ లోకాన్ని విడిచివెళ్లాలని నిర్ణయించుకున్నారేమో..! ఎడబాటును తట్టుకోలేక.. ఎదురించే ధైర్యం లేక.. ఒకే చెట్టు.. ఒకే కొమ్మ.. ఒకే తాడుతో ఊపిరితీసుకున్నారు.
విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతులను సంతోష్, శైలజగా పోలీసులు గుర్తించారు. అయితే.. సంతోష్కు ఇప్పటికే వివాహమైనట్లు తెలుస్తోంది. అయితే.. ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాడవం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో సమగ్రంగా వివరాలు సేవకరిస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యాలు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలను చూసి పలువురు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇదే సమయంలో మరికొందరు మరోలా స్పందిస్తున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడడం సరికాదని అంటున్నారు. తొందరపాటు నిర్ణయాలతో నిండుజీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతీయువకులు అనాలోచిత నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారని అంటున్నారు. అయితే.. ఈ ప్రేమజంట ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.