కరోనా వైరస్... ఇపుడు యావత్ భూమండలాన్ని గడ గడలాడిస్తున్న అతి సూక్ష్మమైన వైరస్. దాదాపుగా  అన్ని దేశాలూ దీనికి భయపడుతున్నాయి. నానాటికీ, పాజిటివ్ కేసులతో పాటు అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు, విమాన సర్వీసుల రద్దుతో ఇక్కట్ల పాలవుతున్నారు. తాజాగా... కరోనా ఎఫెక్ట్‌తో ఓ తల్లి తన పిల్లలకు దూరమైంది. వీసా కోసం మలేషియా వెళ్లిన ఆమె, అక్కడే చిక్కుకుపోయింది. 

 

వివరాలిలా వున్నాయి.... విశాఖపట్నం, శివాజీపాలెంకు చెందిన సింధూష, విజయ్‌చంద్ర దంపతులు. భర్త మలేషియాలో సాఫ్టువేర్ జాబ్ చేస్తున్నాడు. వివాహం తర్వాత వీళ్ళు మలేషియాలోనే కాపురం వుంటున్నారు. అయితే, గతేడాది సింధూష, డెలివరీ కోసం విశాఖపట్నంలో  ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. ఏడు నెలల క్రితం పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఈలోపు ఆమె వీసా గడువు రావడంతో.. రెన్యూవల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీసా పని మీద రెండు వారాల క్రితం ఆమె మలేషియా వెళ్లి, రెన్యూవల్‌ చేయించుకుంది. 

 

సింధూష తిరిగి, మలేషియా నుంచి విశాఖపట్నం వచ్చేందుకు ప్రయత్నించగా.. కరోనా ఎఫెక్ట్‌ వలన విమాన సర్వీసులు నిలిచిపోయాయిన సంగతి విదితమే. దాంతో.. సింధూష మలేషియాలోనే చిక్కుకుపోయింది. పిల్లలిద్దరికి ఏడు నెలలు కావడంతో తల్లి కోసం అల్లాడుతున్నారు. ఇండియన్ ఎంబసీ దగ్గరకు వెళ్లి సాయం కోరినా ..ఫలితం లేకుండా పోయింది. ఇండియన్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వెళ్లి పరిస్థితి వివరించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. 

 

ఇక దాంతో కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. పిల్లలు ఇద్దరు కోసమైనా సింధూషను త్వరగా విశాఖకు రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సింధూష తల్లిదండ్రులు తమ బాధను మీడియాకు వివరించారు. ఇద్దరు పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తున్నారని.. ఆమెను మలేషియా నుంచి తిరిగి రప్పించాలని వారు వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: