సోమవారం కేరళలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశంలోనే తొలిసారిగా ఓ అంధురాలు ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించింది. ఆమే ప్రాంజల్ పాటిల్. 2017లో 124వ ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించి తన కలనెరవేర్చుకుంది. ప్రాంజల్ పాటిల్ ప్రస్తుతం తిరువనంతపురం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది.
వైకల్యం
విజయాలకు ఎప్పుడూ అడ్డుకాదంటోంది
ప్రాంజల్.. నిరంతర
ప్రయత్నాల ద్వారానే విజయాలు
సాధ్యపడతాయని ఆమె చెబుతోంది.
ఆమె ట్రైనింగ్ సమయంలో
ఎర్నాకులం జిల్లా అసిస్టెంట్
కలెక్టర్ గా శిక్షణ తీసుకుంది.
దేశంలోనే తొలి అంధురాలైన
మహిళా ఐఏఎస్ గా ఆమె గుర్తింపు
పొందింది. ఇంతకీ ఈ
ప్రాంజల్ ఎవరు.. ఎక్కడి
వారు.. ఓసారి
పరిశీలిస్తే.. ప్రాంజల్
పాటిల్ స్వస్థలం మహారాష్ట్రలోని
ఉల్హాస్ నగర్. ప్రాంజల్
కు ఆరేళ్ల వయసులో చూపు
కోల్పోయింది. కానీ
పోయింది కంటిచూపే.. మనోధైర్యం
కాదని ఆమె నిరూపించింది.
పట్టుదలతో చదువులో
రాణించింది.
కళ్లు లేకపోయినా అపార ప్రతిభ ఆమె సొంతం. ఎప్పటికప్పుడు తన మేథస్సును పదును పెట్టుకుంటూ ముందుకు సాగింది. సివిల్స్ ను టార్గెట్ గా చేసుకున్న ప్రాంజల్.. 2016 యూపీఎస్సీ పరీక్షల్లో 773వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకుకు మంచి పోస్టింగ్ రాదని తెలిసి మరోసారి పోటీకి సిద్ధపడింది. 2017లో మంచి ర్యాంకుతో ఐఏఎస్ సాధించింది. అందుకే అంటారు.. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అని.