ఓ సామాజిక కార్యకర్త దాఖలుచేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది. అయితే,ఈ తీర్పును మీడియా అంతగా పట్టించుకోలేదు కానీ, ప్రస్తుతం దీనిపై ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాల్ని రగిలించిన  వెటర్నరీ డాక్టర్ అత్యాచారం,హత్య కేసు చూస్తే ఆ తీర్పుని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.ఫుల్లుగా మద్యం సేవించి చేసిన నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత అని ప్రశిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ వెంకటేశ్ విచారణ చేపట్టి తీర్పును వెల్లడించారు.
 
ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు.. ఆల్కహాల్‌తో సంబంధం ఉన్న నేరాలకూ బాధ్యత వహించి తీరాలని సంచలన తీర్పు చెప్పారు. మద్యం మత్తులో జరిగే నేరాలను పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని, బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలే స్వయంగా తమ ప్రజలకు మద్యం అమ్ముతున్నాయని, వాటిని నిషేధించడంలేదని అన్నారు. ఈ మధ్య కాలంలో యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి పెడదారి పడుతున్న ఘటనలు అధికమయ్యాయి.  

 జాతీయ నేర గణాంక నమోదు సంస్థ (ఎన్‌సీఆర్బీ) ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70 నుంచి 85 శాతం మద్యం మత్తులో జరుగుతున్నవే. ఎన్ఆర్‌సీబీ సర్వే 2014 ప్రకారం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో అధిక శాతం మద్యం మత్తులో పాల్పడినవే కావడం విశేషం. 2026 మందిపై లైంగిక వేధింపులు, 1,423 మంది కిడ్నాప్, 1,286 మందిపై అత్యాచారం, 11,206 మందిపై వివిధ నేరాలకు పాల్పడ్డారు. నాటి ఢిల్లీ నిర్భయ నుంచి నేటి తెలంగాణ  వెటర్నరీ డాక్టర్  వరకు ఎన్నో అత్యాచార, హత్యోందంతాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయన్న చేదు నిజం మింగుడు పడటం లేదు. రాజ్యాంగంలో ఏడో షెడ్యూల్‌లోని లిస్ట్ 2 ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం అమ్ముకునే వీలుంది. దేశవ్యాప్తంగా సగటున ఐదు రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు మద్యం అమ్మకాలే ఆధారం. ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయంలో మద్యం అమ్మకాలు రెండు లేదా మూడు స్థానాల్లో ఉంటాయి. అందుకే ఏ రాష్ట్రాలూ మద్యపాన నిషేధం జోలికి పోవడం లేదు. గుజరాత్, మిజోరం, నాగాలాండ్, బిహార్‌‌లో మాత్రమే మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతోంది. 

తమిళనాడు, కేరళ, ఢిల్లీలో మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను నిర్వహించేది. తాజాగా, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా ప్రయివేట్ వ్యక్తుల ద్వారా మద్యం అమ్మకాలకు స్వస్తిపలికి స్వయంగా ప్రభుత్వాలే రిటెయిల్‌ అమ్మకాలు మొదలెట్టాయి. ఐపీసీ సెక్షన్ 108 ప్రకారం.. నేరానికి పాల్పడటమే కాదు, దానిని ప్రోత్సహించినా నేరమే. నేరానికి పాల్పడటానికి ప్రేరేపించడం గురించి తెలిపే ఐపీసీ సెక్షన్ 107 ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ కేసులో మద్రాసు హైకోర్టు పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: