ఏడేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అమె పట్ల అత్యంత పాశవికంగా కామాంధులు వ్యవహరించిన తీరుపై దేశం యావత్తూ సిగ్గుతో తలదించుకుంది. ఈ కేసులో నిందితులకు ఢిల్లీ హైకోర్టు ఉరి శిక్ష విధించగా, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం సైతం నిందితులకు ఉరే సరైందని ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో దోషులు తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రపతికి విన్నవించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది.

తాజాగా, హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ఉదంతంతో నిర్బయ దోషులకు తక్షణమే ఉరిశిక్ష అమలుచేయాలనే డిమాండ్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో ఉన్న దోషులకు ఉన్న ఫళంగా ఉరిశిక్ష అమలు చేయలంటే జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వీరిని ఉరితీసే వ్యక్తి లేకపోవడమే దీనికి కారణం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. మరో నెల రోజుల్లో దోషులకు ఉరిశిక్ష అమలుచేసే అవకాశం ఉండటంతో వివిధ ఆప్షన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. కోర్టు బ్లాక్ వారెంట్ జారీచేసిన తర్వాత ఏ క్షణమైనా వారిని ఉరితీస్తారు. దోషుల క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే ఈ వారెంట్‌ను కోర్టు జారీచేయనుంది. 

చివరిసారిగా పార్లమెంట్‌పై దాడికేసులో దోషిగా తేలిని అఫ్జల్ గురు‌ను ఉరితీశారు. అయితే, ఆఫ్జల్ గురును ఉరితీసేటప్పుడు చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో తిహార్ జైలు అధికారులే లీవర్‌ను లాగినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తీహార్ జైలు అధికారులు ఉరి లాగే వ్యక్తి కోసం అనధికారికంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.. యూపీలోని పలు గ్రామాల్లో ఇలాంటి వ్యక్తులు ఎవరు ఉన్నారని  ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఉరిశిక్షలు అమలుచేయకపోవడంతో ఉరితీసేవారిని జైల్లో నియమించలేదని, ఇప్పుడు అవసరం రావడంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని భావిస్తున్నారు. అత్యంత అరుదైన కేసుల్లో తప్పా ఉరిశిక్ష విధించకపోవడంతో పూర్తిస్థాయిలో ఉరితీయడానికి ఉద్యోగిని నియమించే అవసరం ఏర్పడలేదు.. అంతేకాదు, ఈ విభాగంలో పూర్తిస్థాయి ఉద్యోగి ఎంపిక కూడా ఎంతో కష్టమైందని జైలు అధికారులు వివరించారు. 

ఇదిలా ఉండగా తన కారుణ్య మరణానికి అంగీకరించాలంటూ నిర్బయ కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అతడి పిటిషన్‌ను ఢిల్లీ సర్కార్ తిరస్కరించింది. మెర్సీ కిల్లింగ్ కోసం రాష్ట్రపతికి పిటిషన్ వినయ్ శర్మ దాఖలు చేసిన ఆ పిటిషన్ ను పరిశీలించిన ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్.. ఆ పిటిషన్ ను తిరస్కరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కోరారు. పిటిషనర్ అత్యంత క్రూరంగా ఓ అమాయకురాలిని రేప్ చేసి చంపారని, అంత ఘోరమైన నేరాన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషన్ ను పరిశీలించాలన్నారు. దీనిని పరిశీలించిన తర్వాత గవర్నర్ కేంద్ర హోంశాఖ పంపుతారు. తర్వాత అది రాష్ట్రపతికి చేరుతుంది. మిగతా దోషులు ముఖేశ్, పవన్, అక్షయ్‌లు మాత్రం రాష్ట్రపతికి పిటిషన్ దాఖలుచేయకపోవడంతో వారికి వారం రోజులు గడువు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: