రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో హత్యకు గురైన దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించారు. దిశను హత్య చేసిన 24గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకుని.. 30న చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెప్పారు. నలుగురు నిందితులు మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులను విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం చటాన్ పల్లి వద్దకు తీసుకువచ్చామని తెలిపారు. దిశకు చెందిన సెల్ ఫోన్, వాచీని ఎక్కడ దాచారని తెలుసుకునేందుకు నిందితులను తీసుకువచ్చినట్లు చెప్పారు.

 

 ఆ సమయంలో నిందితులు గుంపుగా ఏర్పడి పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, అనంతరం పోలీసుల వద్ద రెండు వెపన్లను తీసుకొని కాల్చేంచేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సరెండర్ కావాలని ఎంత చెప్పినా వినకుండా దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారని సీపీ తెలిపారు. శుక్రవారం ఉదయం 5.45 నుంచి 6.15 సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులు చనిపోయారని తెలిపారు. నిందితులు జరిపిన దాడిలో ఎస్సై వెంకటేశ్వర్లు పాటు కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారని… వారు ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. 

 

నలుగురు నిందితులను విచారిస్తున్న సమయంలో చాలా విషయాలు చెప్పారని.. వారిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులున్నాయన్నారు. నలుగురు కరడుగట్టిన నేరస్థులని పోలీసుల దగ్గర వెపన్లు లాక్కుని ఫైరింగ్ స్టార్ట్ చేశారన్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేశారు. దిశ సెల్ ఫోన్, వాచీని చూపిస్తామంటూ పోలీసులను అటూ ఇటూ తిప్పుతూ పోలీసులపైకి దాడి చేశారని చెప్పారు. 

 

ఈ నెల 27న హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ హత్య కేసులో అనే కోణాల్లో విచారణ జరిపామని చెప్పారు. ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 10మంది పోలీసులు పాల్గొన్నారని చెప్పారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవుల దగ్గర రెండు వెపన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఫొరెన్సిక్ నిపుణుల సమక్షంలో నిందితుల డెడ్ బాడీలకు పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. దిశ కుటుంబాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా అందరూ అండగా నిలవాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: