అమ్మను మించి దైవమున్నదా...ఆత్మను మించి అర్దమున్నదా. శాశ్వత సత్యమిదే అని ఓ సినీ కవి అన్నారు. చిన్నప్పుడు అమ్మ మనల్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా పెంచుతుంది. తను తినకుండా మనకు పెడుతుంది. తనకు లేకపోయిన పిల్లల మంచి చెడుల గురించి ఆలోచిస్తుంది. అదే అమ్మకు వయసయిపోయి మంచం మీద ఉండే చూసే నాదుడే ఉండడు. ఆ అమ్మకు ఒక ముద్ద పెట్టే పిల్లలు మాత్రం ఉండడంలేదు. ఇలాంటి ఓ తల్లి కథబయటకు వచ్చింది. నిస్సహాయ స్థితిలో కొడుకులు పట్టించుకోకుండా పోవడంతో రోడ్డున పడి ఆశ్రయం కోసం ఎదురుచూస్తోంది ఆ తల్లి. వృద్దాప్యంలో ఆమె పడుతున్న వేదన చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లక మానవు. ఆమె పేరు అనంతుల లక్ష్మమ్మ. వయస్సు 80 ఏళ్లు. యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలంలోని ముత్తి రెడ్డి గూడెంనికి చెందిన లక్ష్మమ్మను పిల్లలు ఇంటి నుంచి గెంటేశారు.
లక్ష్మమ్మకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక కూతురు ఉంది. తల్లికి తిండిపెట్టలేని దీన స్థితిలో అయితే ఆమె బిడ్డలు లేరు. కానీ వృద్ధాప్యంలో తల్లి భారమైంది. 70 ఎకరాల భూమి... ఇతర ఆస్తుపాస్తుల్ని కూడా రక్షిస్తూ వచ్చింది. బహుశా అదే ఆమె చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నారో ఏమో..? లక్ష్మమ్మ నుంచి ఆస్తిని లాక్కుని పంచుకున్న పిల్లలు ఆమెను మాత్రం రోడ్డుపైకి నెట్టేశారు. పాతికేళ్ళ క్రితమే ఆమె భర్త మరణించాడు. దీంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో నెలకు చప్పున పెట్టుకుని అమ్మని సాకేవారు తర్వాత తర్వాత అందరికీ భారమయిపోయింది ఆ తల్లి.
ఆమెకు టైమ్కి అంత ముద్ద పెట్టడం కూడా భారమయిపోయింది ఆ కొడుకులకు. వృద్దాప్యంలో ఉన్న ఆ తల్లిని రోడ్డు మీద వదిలిపెట్టగా బిక్కు బిక్కు మంటూ చెట్టుకింద గడుపుతూ వచ్చింది. ఇది చూసిన స్థానికుల మనసు చెలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నతల్లి మీద కనికరం లేని ఇలాంటి కసాయి బిడ్డలను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.