మృగాలు అంటే అడవిలో ఉండేవి ఇప్పుడు మనముందు మనుషుల రూపంలో తిరుగుతున్నారు. దేశమంతటా కొందరు మానవ మృగాల బారిన పడి వేలాది మంది నిర్భాగ్యులు యాసిడ్ దాడుల వల్ల జీవితాంతం నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే చాలా కేసుల్లో నిందితులపై చార్జిషీట్లు కూడా ఫైల్ కావడం లేదు. చార్జిషీట్లు ఫైల్ అయినా విచారణ పూర్తి కావడం లేదు. విచారణ పూర్తయినా దోషులకు శిక్ష పడుతున్న సందర్భాలు మాత్రం గత రెండేళ్లుగా బాగా తగ్గిపోయాయి.
గత అయిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే యాసిడ్ దాడుల విషయంలో పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీదే అగ్రస్థానం. ఇదిలా ఉంటే.. తాజాగా తన మరదలిపై ఏకంగా బావే యాసిడ్తో దాడి చేశాడు. ఈ ఘోరం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా కదబా పట్టణంలో జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదమే దీనికి కారణం అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన మరదలు అయిన స్వప్నపై సాక్షాత్తూ బావ అయిన జయానంద యాసిడ్తో దాడి చేశాడు.
అయితే ఈ దాడిలో స్వప్న ముఖం కాలి పోయి గాయాలయ్యాయి. మరోవైపు స్వప్న మూడేళ్ల కుమార్తె కూడా ఈ దాడిలో స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో బాధితురాలు స్వప్నను.. ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్వప్న, ఆమె కూతురు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడు జయానందపై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు.