ప్రియుడు చేసిన మోసానికి ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి.. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే అతనికి తన సర్వం అర్పించుకుంది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చిందని తెలియగానే మొహం చాటేశాడు. అయితే పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడింది. అతను నిరాకరించడంతో చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియని తల్లిదండ్రులు పోస్టుమార్టంకు పంపించారు. అక్కడ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు, తల్లిదండ్రులు విస్తుపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని ఓ తండాకు చెందిన బాలిక పాఠశాలకు వెళ్లే సమయంలో అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన బాలుడు (17) పరిచయం అయ్యాడు. బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా... ఆ బాలుడు దూరవిద్య ద్వారా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇక్కడ వీరు మరింత దగ్గర అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గర్బం దాల్చింది. బాలిక పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో ససేమిరా అన్నాడు. దీంతో ఆమె గతేడాది సెప్టెంబరు 3న ఆత్మహత్యాయత్నం చేసింది.
చికిత్స పొందుతూ అదే నెల 7వ తేదీన ఆస్పత్రిలో మృతిచెందింది. అయితే ఆమె తల్లిదండ్రలు విషయం తెలియక కడుపునొప్పి భరించలేక చనిపోయిందని పోలీసులకు తెలియజేశారు. ఇక మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్న సమయంలో ఆమె కడుపులో ఆరు నెలల పిండం ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. అప్పుడే వాళ్లకు అనుమానం వచ్చి కేసును ఆరా తీస్తుండంగా.. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు.
కాని, పట్టువదలని విక్రమార్కుల్లా పోలీసులు కేసును వదిలిపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే కల్వకుర్తి న్యాయస్థానం అనుమతితో ఆరుగురి నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షకు పంపించారు. అప్పుడే ఆరుగురిలో ఓ బాలుడి డీఎన్ఏ సరిపోలడంతో అతడిని అరెస్ట్ చేసి గట్టిగా ప్రశ్నించారు. ఇక పక్కా ఆధారాలు ఉండటంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలా సదరు బాలిక మృతి చెందినా.. ఆమె కడుపులో బిడ్డ మాత్రం నిందుతుడిని పట్టించింది.