ఇటీవల కాలంలో అమ్మాయిలు, చిన్నారులు మరియు వివాహితలపై లైంగికదాడులు బాగా పెరిగిపోతున్నాయి. ఆడవాళ్ల మీద జరుతున్న లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన నిర్భయ లాంటి చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ఏమీ పని చేయడంలేదు. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న లైంగికదాడులు, అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా... మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రభుత్వాలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా.. అవేమి ఈ మానవ మృగాలకు పట్టడం లేదు.
ఇక తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లి బ్రహ్మానందపురానికి చెందిన వలపర్ల నాగరాజు ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అయితే నాగరాజుకు 2014లో మంగళగిరికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. ఇక వీరి ఇంటి పక్కనే ఉండే బాలశౌరి అనే వ్యక్తి సుజాతను లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరిక తీరిస్తే ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తానని, అనేక రకాలుగా లబ్ధి పొందేలా చేస్తానని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో ‘నువ్వు చనిపోయేలోపు నిన్ను అనుభవిస్తాను.
నీ భర్తతో కాపురం ఎలా చేస్తావో చూస్తాను. రోజూ నీ భర్త బయటకు వెళ్లిన తర్వాత నన్ను సుఖపెట్టు’ అంటూ తరచూ వేధిస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిస్తే కాపురం నాశనమవుతుందన్న భయంతో సుజాత బయటకు చెప్పలేక తనలో తానే కుమిలిపోయేది. అయితే ఈ సారి మరింత రెచ్చిపోయిన బాలశౌరి ఆదివారం రాత్రి భర్త లేని సమయంలో ఇంటికి సుజాత ఇంటికి వెళ్లి.. కోరిక తీరుస్తావా లేదా? అంటూ సుజాతను ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయగా ఆ కామాంధుడు పరారయ్యాడు. దీంతో అవమానంగా భావించిన సుజాత సోమవారం ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీస్ కేస్ పెట్టగా దర్యాప్తు ప్రారంభించారు.