చామదుంప.. పేరు వినగానే ఈ కాలం యువత ఆబ్బె అంటుంది. కానీ ఈ కాలం యువతకు తెలియదు. చామ దుంప వేపుడు ఎంత రుచిగా ఉంటుంది అనేది. ఒకవేళ తెలిస్తే చామదుంపను తినకుండా అసలు ఉండలేరు. అలాంటి ఈ చామదుంప వేపుడు ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావాల్సిన పదార్ధాలు...
చామ దుంపలు - పావు కేజీ,
బియ్యప్పిండి - పెద్ద చెంచా,
కారం - చెంచా,
పసుపు - పావుచెంచా,
ఆమ్చూర్ పొడి - అర చెంచా,
ఉప్పు - తగినంత,
నూనె - వేయించేందుకు సరిపడేంత.
మినప్పప్పు - చెంచా,
ఆవాలు - అర చెంచా,
ఎండుమిర్చి - రెండు,
కరివేపాకు - రెబ్బ,
వెల్లుల్లి రెబ్బలు - ఐదు,
నూనె - చెంచా,
కూరకారం - చెంచా.
తయారీ విధానం..
శుభ్రంగా కడిగిన చామదుంపల్ని కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి తియ్యాలి. ఆతరవాత చెక్కు తీసి చక్రాల్లా కోయాలి. వీటిపై బియ్యప్పిండి, కారం, పసుపు, ఆమ్చూర్ పొడి, ఉప్పు, నూనె వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఆతర్వాత బియ్యం పిండిని మరికొంచెం కూడా కలుపుకొని. బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె వేసి ఈ ముక్కల్ని కరకరలాడేలా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి మెత్తగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఆతర్వాత అందులోకి వేయించి పెట్టుకున్న చామ దుంప ముక్కలు వేసి, పైన కూరకారం చల్లాలి. రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. అంతే చామదుంపల ఫ్రై రెడీ.