కన్నతల్లి కాదు...కర్కోటకురాలు..ఆమె అత్త అంతకన్నా పాపిష్టురాలే.. ఆడబిడ్డ పుట్టిందని ఇద్దరు కలిసి శిశువుకు జిల్లెడు పాలు పట్టించి చంపేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని మెట్టనూత్తు పంచాయతీ రామనాథపురంలో మార్చి 2న జరిగింది. అయితే జిల్లెడు పాలు పట్టించి చంపించిన విషయం పోలీసుల దర్యాప్తులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామనాథపురానికి చెందిన సురేష్ కవితా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే కొడుకు కావాలని మూడో సంతానం కోసం ప్రయత్నించారు. కవిత గర్భం దాల్చి.. ప్రసవం కోసం ఫిబ్రవరి 20న క.విలక్కు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
అదే నెల 26న ఆమెకు సాధారణ ప్రసవం ద్వారా ఆడ బిడ్డ పుట్టింది. 2 రోజుల తరువాత ఇంటికి వచ్చారు. అయితే మగబిడ్డ పుడుతాడని ఎంతగానో ఆశలు పెట్టుకున్న వారికి మళ్లీ ఆడబిడ్డ పుట్టడంతో చంపేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కవితతో ఆమె అత్తా చెల్లామ్మాల్తో కలసి శిశువుకు జిల్లెడు చెట్టు పాలు పట్టించి చంపేశారు. అనంతరం శిశువు అనారోగ్యంతో చనిపోయిందని స్థానికంగా ప్రచారం చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పాతి పెట్టారు. శిశువును పథకం ప్రకారమే చంపారని అనుమానంతో స్థానికుల్లో కొంతమంది జిల్లా శిశు సంక్షేమ రక్షణ కార్యాలయం, ఆండిపట్టి తహసీల్దార్ చంద్రశేఖర్కి సమాచారం అందించారు.
తహసిల్దార్ చంద్రశేఖర్ గ్రామ నిర్వాహక అధికారి దేవి, రాజధాని పోలీసులు సంయుక్తంగా చేసిన దర్యాప్తులో కవితా, అత్త చెల్లమ్మాల్లు ఉద్దేశపూర్వకంగా శిశువును హత్యచేసినట్లుగా రుజువైంది. తమదైన శైలిలో అత్తాకోడళ్లను విచారించడంతో అసలు విషయం మొత్తం చెప్పేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈసంఘటన తమిళనాడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయన్ని పంచుకున్నారు.ఇలాంటి వారికి ఉరిశిక్షలు ఎందుకు అమలు చేయరు...అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరు కూడా ఆడళ్లే కదా.. మిమ్మల్ని కన్నా వారు ఇలా చేసి ఉంటే బతికే వారా..? అమ్మతనానికే మచ్చ మీరు అంటూ తిట్టిపోస్తున్నారు.