స్నేహం ముసుగేసుకుని ఆన్లైన్లో అమ్మాయితో పరిచయం పెంచుకున్న ఓ దుర్మార్గుడు... ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టి డబ్బులిస్తావా...లేకుంట నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టనా..? అంటూ బెదిరింపులకు దిగాడు. అమ్మాయి తల్లిదండ్రుల సాయంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరస్థుడిని అదుపులోకి తీసుకుని కటకటలా వెనక్కి పంపారు. ఈ సంఘటన చెన్నై పట్టణంలో జరిగింది. అహ్మదాబాద్కి చెందిన దినేష్(40) ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతుంటాండు. తనకి కేవలం 20 ఏళ్లేనని.. స్టైల్గా ఉన్న ఇతరుల యువకుల ఫొటోలు అప్లోడ్ చేస్తూ అమ్మాయిలకు ఎరవేస్తుంటాడు.
ఈక్రమంలోనే సోషల్ మీడియా ద్వారా చెన్నైకి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఎంతో మంచి గుణగణాలున్న వ్యక్తికి మల్లే నటిస్తూ ఇష్టాఇష్టాలు, అభిరుచులు పంచుకున్నారు. ఇక మెల్లగా పర్సనల్ విషయాల వరకు తీసుకెళ్లాడు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఫేక్ అకౌంట్లోకి రప్పించుకున్నాకా...బెదిరింపులకు దిగాడు. నీ పర్సనల్ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. నే చెప్పిన రూ.2లక్షల అమౌంట్ నాకు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్పర్ చెయ్. లేదంటే ఈ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ముందు భయపడిన సదరు యువతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.
వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వారు రంగంలోకి దిగి ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలకు ఎరవేసి బ్లాక్ మెయిల్స్తో డబ్బులు గుంజుతున్న దినేష్ను అహ్మదాబాద్లో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా పరిచయాలను గుడ్డిగా నమ్మేస్తున్న యువతులు.. వంచనకు గురవుతునే ఉన్నారు. ముక్కు మొహం తెలియని వాడిని నమ్మడం కరెక్ట్ కాదని, అది అనేక అనార్థాలకు దారితీస్తుందని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా యువతులను ఫ్రెండ్ షిప్ పేరుతో నమ్మించి వంచనకు గురిచేస్తున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తునే ఉన్నాయి. ఆన్లైన్ స్నేహాలు మంచివి కావని పోలీసులు హెచ్చరిస్తున్నారు.