ప్రేమించి పెళ్లాడిన యువతిని ఓ దుర్మార్గుడు, కట్న పిశాచి తన కుటుంబసభ్యులతో కలిసి చంపేశాడు. విషయం బయటకు రాకుండా పొలంలో ఆమె శవాన్ని పూడ్చేసి... తన భార్య కనబడటం లేదని ఆ కర్కోటుకుడే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే మృతురాలి తల్లి అల్లుడు, అత్తా, మామలపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వారందరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కురబలకోట మండలంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘాతుకం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురబలకోట పట్టణంలోని ఎన్వీఆర్ వీధికి చెందిన కుమారి, భాస్కర్ల కుమార్తె జి.గాయత్రి (28) తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది.
అయితే కాలేజీకి వెళ్లొచ్చే క్రమంలో అద్దె బస్సులో డ్రైవర్గా పనిచేస్తున్న మల్రెడ్డితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం రెండు కుటుంబాల్లో తెలియడం, వారు అంగీకరించకపోవడం జరిగాయి. దీంతో మనకు ఎవరూ అవసరం లేదు..నీకు నేను నాకు నువ్వు అంటూ మాయమాటలు చెప్పాడు. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మల్రెడ్డి కుటుంబసభ్యులు ఇంటికి రావాలనిచెప్పడంతో వారి వద్దకు వెళ్లిపోయారు. మెట్టినింట్లో అడుగు పెట్టిన నాటి నుంచి గాయత్రికి వేధింపులు మొదలయ్యాయి. దీంతో 2019, సెప్టెంబరు 10న భర్త, అత్తమామలపై పోలీసులకు గాయత్రి కుటుంబసభ్యులు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కట్నం తీసుకురావాలని చెప్పినా చేయడం లేదని మల్రెడ్డి పలుమార్లు ఆమెపై చేజేసుకున్నాడు. అయితే ఈ ఏడాది జనవరి 2వ తేదీన గాయత్రిని తన తల్లిదండ్రుల సాయంతో మల్రెడ్డి చంపేశాడు. అనంతరం శవాన్ని వారి పొలాల మధ్య పూడ్చేశాడు. ఏం తనకు తెలియట్టుగా 6వ తేదీన మదనపల్లె రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అదే సయంలో మృతురాలి తల్లి కుమారి ఫిర్యాదుతో గాయత్రి భర్త, అతడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. గాయత్రిని చంపేసి పొలంలో పూడ్చిపెట్టినట్లు మల్రెడ్డి ఒప్పుకున్నారు.