రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువ వుంటుందే వారిపైనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణీలకు కూడా రోగనిరోధక శక్తి తక్కువగా వుంటుంది. మన దేశంలోనే ఈ సమస్య మరీ ఎక్కువ. చాలా సర్వేల ప్రకారం మనదేశంలో రక్తహీనతతో బాధపడే మహిళల సంఖ్య ఎక్కువ. కడుపులో ఓ బిడ్డను మోస్తూ రక్తహీనత కూడా వుంటే అలాంటి వారికి ఈ కరోనా వైరస్ తొందరగా సోకే అవకాశం వుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీలు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు.
సాధారణంగా గర్భం ధారణ సమయంలో మూడు దశలు వుంటాయి. మొదటి మూడు నెలలు మొదటి దశ, మూడో నెల నుండి ఆరో నెల వరకు రెండో దశ, ఆ తర్వాత తొమ్మిదో నెల వరకు మూడో దశ. ఈ మూడు దశల్లో ఒక్కో సమయంలో కొన్ని ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే వాంతులు అవుతున్నా కచ్చితంగా ఏదో ఒకటి తింటూ వుండాలి . కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం. సాధారణంగా మొదటి మూడు నెలలు పోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు. అవి కొనసాగిస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధారణ సమస్యలకు డాక్టర్లు అందుబాటులో వుండడం లేదు. కాబట్టి ప్రతి సమస్యకు డాక్టర్ల దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అసలు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇతర ఏ సమస్యలూ లేకపోతే మొదటి మూడు నెలలు వరకు పొలిక్ యాసిడ్ టాబ్లెట్లు కచ్చింతగా వాడి ఆ తర్వాత నుండి కాల్షియం, ఐరన్ మందులు కొనసాగిస్తే సరిపోతుంది. హెల్ప్ లైన్ నుండి చాలా మంది ఫోన్లు చేసి ''నాకు స్కానింగ్ కోసం రమ్మనమని డేట్ ఇచ్చారు. వెళ్ళకపోతే ఏమైనా అవుతుందా'' అని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి చెప్పేది ఒక్కటే స్కానింగ్ చేయించుకోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. ముందే చెప్పినట్టు ప్రత్యేకమైన సమస్యలు ఏమీ లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో వుండడం మంచిది. లోబల బిడ్డ తిరుగుతూ ఆరోగ్యంగా వుంటే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ కదలికలు లేకపోతేనో, బ్లీడింగ్ కనిపిస్తేనో అప్పుడు కచ్చింతంగా డాక్టర్ను సంప్రదించాలి. అలాంటి సమస్యలు ఏమీ లేకుండా సాధారణంగా చెకప్ల కోసం డాక్టర్ల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వెళితేనే సమస్య అని గుర్తుపెట్టుకోవాలి.
హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ల కోసం ఎదురు చూడాలి. అక్కడ పడుకొని, కూర్చొని స్కానింగ్లు చేయించుకోవాలి. మిగతా వారితో కలవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం నూటికి 20 మందిలో ఒకవేళ కరోనా వున్నా ఎలాంటి లక్షణాలు పైకి కనిపించడం లేదు. కాబట్టి బయటకు వెళ్ళి అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవడమే. మరీ అంతగా తెలుసుకోవాలంటే ప్రస్తుతం చాలా చోట్ల వీడియో, స్కైప్ కాల్స్ ద్వారా సలహాలు ఇస్తున్నారు. అవకాశం వున్న వారు వాటి సహాయం తీసుకుంటే సరిపోతుంది.
కచ్చితంగా ప్రతి గంటలకు ఓసారి 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.