అమ్మ.. రెండు అక్షరాల పదమే అయినా.. అందులో ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎందులోనూ దొరకదు. భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ. అందుకే మన మొదటి గురువు అమ్మ అంటారు. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఇక మనం అమ్మ కోసం ఏం చేసినా.. మన కోసం ఆమె చేసిన త్యాగాల ముందు అవి దిగదుడుపే అనడంతో ఏ మాత్రం సందేహం లేదు. అడగందే అమ్మ కూడా ఏమీ పెట్టదంటారు. కానీ అది అబద్దం. పిల్లల మనస్తత్వం సరిగా అంచనా వేయడంలో అమ్మ తర్వాత ఎవరైనా.
మరి ఆ తల్లిని గౌరవించడానికి ఓ రోజుండాలన్న తలంపు ఎక్కడి నుంచి మొదలైంది. ఎవరి ఆలోచన ఇది. అమ్మను గౌరవించాలనే ఆలోచనతో పుట్టినదే మదర్స్ డే. అమెరికాలో మొదలైన ఈ సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా నేటికీ కొన సాగుతోంది. మదర్ ఆఫ్ ద గాడ్స్ రియాకు నివాళులర్పించే కార్యక్రమానికి మొదటిసారిగా గ్రీసు దేశస్తులు శ్రీకారం చుట్టారు. ఇంగ్లాండులో తల్లుల గౌరవార్థం ‘మదరింగ్ సండే’ నిర్వహించే వారు. 1910లో జర్విస్ జ్ఞాపకార్థం యూఎన్ఏలోని వర్జీనియా రాష్ట్రం ‘మదర్స్డే’ను గుర్తించింది. జర్విన్ కుమార్తె దీనికోసం బాగా ప్రచారం చేశారు. 1914లో అమెరికా మదర్స్డేను అధికారికంగా ప్రకటించింది.
అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత మన కోసం అన్నీ చేస్తోన్న వారికి ఒకరోజు కేటాయించడం గొప్ప కదా అనుకొని.. అన్నీ దేశాలు నిర్వహిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ మదర్స్ డే ని మే పదో తారీఖున జరుపుకుంటున్నాం. అంటే రేపే మదర్స్ డే అన్నమాట. కానీ ఈ సారి కరోనా వైరస్ మదర్స్ డేపై ఎఫెక్ట్ చూపనుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే చదువుకొనేందుకు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన పిల్లలు తమ మాతృమూర్తులను కలుసుకొనే అవకాశం లేకుండా పోయింది.