గర్భిణీ స్త్రీలు నిద్రపోయే సమయంలో కుడివైపుకు తిరిగి పడుకుంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదమని ఒక పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు నిద్రాసమయంలో అప్రమత్తంగా ఉండాలని గైనకాలజిస్ట్‌లు తెలియజేస్తున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో స్త్రీలు తీసుకునే జాగ్రత్తలను అనుసరించే ఆమె ప్రసవం సుఖప్రసవమా? లేక సిజేరియనా? అనేది నిర్ణయించబడుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సమయాల్లో గర్భస్థ శిశువు పుట్టడానికి ముందే చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 

 

 

గర్భంతో ఉన్న సమయంలో స్త్రీల శరీరపు బరువు పెరగడం, వయసు మీరిన తర్వాత తల్లి కావడం, తల్లి పేగు పరిస్థితి, గర్భస్థ శిశువుకి కావసినంత నీరు లేకపోవడం, చివరి సమయంలో బిడ్డకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవడం వంటివి బిడ్డ పుట్టక ముందే చనిపోవడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అయినప్పటికీ గర్భిణులు పడుకునే విధానంను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధనలో తేలింది.

 

 

గర్భిణులు నిద్రపోయే సమయంలో తిన్నగా పడుకోకూడదు, ఒక ప్రక్కకు తిరిగే మాత్రమే పడుకోవాలి. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల తల్లి రక్త నాళాలు చక్కగా పనిచేయడమే కాకుండా బిడ్డకీ, తల్లికీ మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని వెల్లడైంది.తల్లికీ, బిడ్డకీ మధ్య సంబంధాన్ని ఏర్పరచే తల్లి ప్రేగులో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ బిడ్డలు చనిపోవడం జరుగుతుంది. పోషక శక్తి లోపం, ఆక్సిజన్ లోపం, గర్భసంచిలో ఉమ్మినీరు లోపం మొదలైనవి కూడా బిడ్డలు చనిపోవడానికి కారణమౌతాయని తెలియజేశారు. 

 

 

గర్భస్థ శిశువు చనిపోకుండా ఉండేందుకు గర్భిణులు చివరి రెండు నెలల్లో అతి జాగ్రత్తగా ఉండాలని, కాచి వడపోసిన నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలిపారు. పోషక విలువలు కలిగిన పండ్లను తినాలి. ఇంకా సుఖ ప్రసవమయ్యేందుకు కాల్షియం కలిగిన పాలు, జ్యూస్, పెరుగు మొదలైనవాటిని క్రమం తప్పకుండా ఆహారంతో పాటు సేవించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: