భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దసరా.  దసరా అంటే సరదా సరదాగా పండుగ..పేద, ధనిక అనే తేడా లేకుండా తమ స్థాయి ప్రకారం కొత్త బట్టలు కుట్టించుకొని అమ్మవారికి పూజ చేసిన సాయంత్రం జమ్మి ఆకు ఇచ్చుకొని ఒకరినొకరు గౌరవించుకుంటారు.  చిన్నవాళ్లైతే పెద్దల వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే దసరాకు వెజ్, నాన్ వెజ్ లు ఎన్నో రకాలుగా వండుకొని తింటుంటారు.  ఇక స్వీట్లు కూడా ఎంతో ఇష్టంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తింటారు.  

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు.  దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. వాటిలో ఒక్కటైన రవ్వబొబ్బట్లు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంటారు.  మరి ఆ రవ్వబొబ్బట్లు ఏలా చేస్తారో చూద్దామా!

కావలసిన పదార్ధాలు:
 
రవ్వ: 1 కప్పు
గోధుమ పిండి: 1/2 కప్పు
మైదా: 2 కప్పులు 
సోడా: చిటికెడు
పంచదార: 2 కప్పులు
నూనె : సరిపడా
నెయ్యి: సరిపడా


తయారు చేయు విధానం:
 
ముందుగా మైదా, గోధుమపిండి రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని కలపాలి. దానిలో తగినన్ని నీళ్లు, వంట సోడా వేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి. తర్వాత పాన్‌లో నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరోపక్క ఇంకో గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి.నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి.ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూతా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. అంతే నోరూరించే రవ్వ బొబ్బట్టు రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: