దసరా పండుగకు రక రకాల పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ.  ఒక్కో ప్రదేశాల్లో ఒక్కో రకం వంటలు తయారు చేస్తుంటారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దసరా వచ్చిందంటే..అరిసెలు చేయడం చూస్తుంటాం.  

అరిసెలు తయారీ విధానము :

ఒక కె. జి . బియ్యము ముందు రోజు రాత్రి నీళ్ళలో నాన పోసుకోవాలి . మరుసటి రోజు బియ్యాన్ని వడ కట్టి మిల్లులో మెత్తని పిండిలా వేయించుకోవాలి . పిండి పట్టించి వెంటనే జల్లెడ పోసుకుని ఒక గిన్నెలో పోసి పిండిలోని తడి ఆరకుండా గట్టిగా నొక్కి పెట్టి ఉంచాలి.  ఒక వెడల్పాటి పాత్రలో ముప్పావు కిలో బెల్లం మెత్తగా పొడి చేసి వేసి బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి బెల్లం నీళ్ళలో వేసి చూస్తే పాకం ఉండగా అయ్యే విధంగా పాకం రానివ్వాలి . అంటే పళ్ళెంలో నీళ్ళు పోసి పాకం అందులో వేసి చూస్తే ఉండలా కట్టే విధంగా పాకం రావాలి . పాకం లో నాలుగు చెంచాల నెయ్యి వెయ్యాలి .

తర్వాత పాకంలో అర స్పూను యాలకుల పొడి వేసి స్టౌ మీద నుండి దింపి వెంటనే బియ్యపు పిండి పోస్తూ గరిటతో గబ గబా కలియ బెట్టు కోవాలి . పాకం చల్లారక ముందే కలియబెట్టటం పూర్తవ్వాలి . దింపగానే మరో నాలుగు చెంచాలు నెయ్యి వెయ్యాలి . అలా రెండుసార్లు నెయ్యి వేసుకుంటే పాకం రుచిగా మృదువుగా ఉండటమే కాక ఉండలుగా చేయటానికి అనువుగా వస్తుంది . ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి ముప్పావు కే .జి . నూనె పోసి నూనెను బాగా కాగనివ్వాలి .

చలిమిడి చల్లారగానే పిండిని ముద్దలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరు మీద చేతికి నూనె రాసుకుని ముద్దను చేతితో పల్చగా వత్తుకుని కాగిన నూనెలో వేసి చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకొని , అరిసెల చెక్కల మధ్య పెట్టి గట్టిగా నొక్కుకొని నూనె పూర్తిగా పోయాక అరిసెలు తీసి వెడల్పాటి పళ్ళెంలో కాస్త ఆరనిస్తే బాగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి . మెత్తగా కావాల్సిన వారు కొంచెం నొక్కితే సరిపోతుంది . అరిసెలు చేయడానికి మరో మనిషి సాయం ఉంటే సులువుగాను , త్వరగాను అయిపోతుంది . ఈ అరిసెలు నెల రోజులు పైగా నిలవ ఉంటాయి . బాలింతలు ఆర్నెల్ల వరకు అరిసెలు తినకూడదు


మరింత సమాచారం తెలుసుకోండి: