సంక్రాంతి పండుగ వచ్చిందంటే..సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ తమ గ్రామాలకు వెళ్లి ఎంతో ఆనందోత్సాహల మద్య పండుగ సంబరాలు జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న వారు సైతం తమ సొంత గ్రామాలకు విచ్చేసి పండగ వారోత్సవాలు జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే..చిన్న పెద్దా అనే తేడా లేకుండా అందరూ కొత్త కొత్త పిండి వంటల కోసం ఎదురు చూస్తుంటారు. వెజ్, నాన్ వేజ్ తో పాటు రక రకాల పిండి వంటలు చేసుకొని సంక్రాంతి పండుగ రోజు తమ బంధు మిత్రులతో విందు చేస్తారు. నువ్వుల అరిసెలు ఎలా చేస్తారో తెలుసుకుందామా...
ఒకరోజు ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించి పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం సరిపడా నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి. అందులో బియ్యం పిండిని వేసి బాగా కలిపి దించేయాలి.
తరువాత స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసి బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిలో నువ్వులు చేర్చి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకుపై ఒత్తుకుని నూనెలో వేసి రెండువైపులా కాలి ఎరుపు రంగు వచ్చాక తీసేస్తే తియ్యని నువ్వుల అరిసెలు తయార్..