దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్లోని కఠువా లైంగికదాడి కేసులో పఠాన్కోట్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సంచార తెగకు చెందిన ఎనిమిదేండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి, హత్య కేసులో ముగ్గురికి మరణించే వరకూ జైలుశిక్ష, మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. జమ్ముకశ్మీర్కు చెందిన ప్రత్యేక శిక్షా స్మృతి రణ్బీర్ పీనల్కోడ్ (ఆర్పీసీ) కింద విచారణ జరిగిన ఈ కేసులో ఆరుగురిని దోషులుగా ఖరారు చేసిన కోర్టు.. సాక్ష్యాధారాలు లేని కారణంగా మరొకరిని విడుదల చేసింది.
జనవరి 2018న జమ్ము-కాశ్మీర్లోని కథువా జిల్లాలో 8ఏళ్ల బాలికను అతి పాశవికంగా అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలో నిందితులకు ఎట్టకేలకు శిక్షపడింది. ఏడుగురు నిందుతుల్లో ఆరుగురిని దోషులుగా ప్రకటిస్తూ పఠాన్కోట్ జిల్లా సెషన్కోర్టు తీర్పునిచ్చింది. మరొక మైనర్ నిందితుడిని నిర్దోషిగా తేల్చింది. ప్రధాన నిందితుడైన సాంజీరామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. సాంజీ రామ్ కుమారుడు విశాల్ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. తొలుత ఈ కేసును క్రైమ్ బ్రాంచీకి అప్పగించింది. అయితే దర్యాప్తునకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును పఠాన్కోట్ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రోజువారి విచారణలో భాగంగా 144 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది.
కథువా కేసులో పఠాన్ కోట్ కోర్టు సంచలన తీర్పును వెలువరించడంపై రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కోర్టు తీర్పును స్వాగతించారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరిగిందని మెహబూబాముఫ్తీ అన్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు జరిపిన జమ్ము కాశ్మీర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి తీవ్ర నేరాల్లోనూ రాజకీయాలు చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు ఇది తగిన శిక్షే అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.నిందితులకు మద్దతు ప్రకటించిన నేతలు ఇప్పటికైనా చట్టాల గురించి తెలుసుకోవాలని హితవుపలికారు.
కథువా టైం లైన్
జనవరి 10,2018 కథువాజిల్లా రసానాలో బకర్వాల్ గిరిజన తెగకు చెందిన 8 ఏళ్ల బాలిక అదృశ్యం
జనవరి 12, 2018 బాధితుల ఫిర్యాదుతో హిరానగర్ పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు
జనవరి 17, 2018 బాలిక మృతదేహం లభ్యం, సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక
జనవరి 22, 2018 కేసు జమ్ము కాశ్మీర్ క్రైం బ్రాంచ్కు బదిలీ
ఫిబ్రవరి 16, 2018: నిందితుడికి మద్దతుగా రైట్ వింగ్ గ్రూప్,హిందూ ఏక్తా మార్చ్ నిరసన
మార్చి 1,2018 ఇద్దరు బీజేపీ మంత్రులకు నిందితులతో సంబంధాలున్నట్లు గుర్తింపు
ఏప్రిల్ 9,2018 కథువా కోర్టుకు చార్జిషీట్ సమర్పణ.. ఎనిమిది మందిలో ఏడుగురిపై అభియోగాలు నమోదు
ఏప్రిల్ 14,2018 హిందూ ఏక్తా మోర్చా ర్యాలీలో పాల్గొన్న బీజేపీ మంత్రి రాజీనామా… బాలికపై అత్యాచారం, హత్యను అత్యంత అమానవీయ చర్యగా అభివర్ణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్
ఏప్రిల్ 169,2018 కథువా సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభం
మేd 7, 2018 కేసును కథువా కోర్టు నుంచి ప ఠాన్ కోట్ కోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు … ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు ద్వారా విచారణ జరపాలని.. విచారణ ప్రక్రియను సీసీటీవీ ద్వారా రికార్టు చేయాలని ఆదేశం..
జూన్ 3,2019 పఠాన్ కోట్ కోర్టులో ముగిసిన వాదనలు..
జూన్ 10,2019 కోర్టు సంచలన తీర్పు, ముగ్గురికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష
నిందితులు ఎవరంటే....
సాంజీరామ్: 61 ఏళ్ల మాజీ రెవెన్యూ అధికారి, గ్రామపెద్ద. ఈ కేసులో సూత్రధారి. పీనల్కోడ్ సెక్షన్ 302, 376 డి, 363, 120 బి, 2343 కింద కేసు నమోదు చేయబడింది.
దీపక్ ఖజూరియా, సురేందర్వర్మ: జమ్ము-కాశ్మీర్ పోలీసు విభాగంలో వీరిద్దరు స్పెషల్ ఆఫీసర్లు.
ఆనంద్దత్త: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్.. కేసులో కీలక ఆధారాలను మాయం చేసేందుకు సాంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు ముడుపులు తీసుకుని, సహకరించారని ఆరోపణలున్నాయి. రణ్బీర్ పీనల్కోడ్ సెక్షన్ 201 కింద ఇతనిపై అభియోగాలు మోపబడ్డాయి.
తిలక్రాజ్: పోలీస్ హెడ్ కానిస్టేబుల్. కేసులో నేరుగా ప్రమేయం లేకున్నప్పటికీ, ఆధారాలను ధ్వంసం చేసేందుకు దత్తకు సహకరించినట్లు నిగ్గుతేలింది. ఇతనిపైనా సెక్షన్ 201కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.
పర్వేశ్ కుమార్: ఇతను సాంజీరామ్ మిత్రుడు. కేసులో నేరుగా ప్రమేయం ఉంది. మైనర్ బాలుడైన పర్వేశ్ కుమారుడు విశాల్పైనా కేసు నమోదనప్పటికీ, నేరానికి పాల్పడ్డాడనేందుకు రుజువులు లభించలేదు.