నగరాల్లో గొలుసు దొంగల వార్తలు తరచూ చూస్తుంటాం.. ఆడవాళ్లు నడుచుకుంటూ వెళ్తుంటే.. పక్క నుంచి బైకులపై వచ్చి గొలుసు లాక్కుపోతుంటారు కేడీ గాళ్లు.. పాపం.. అనుకోకుండా జరిగిన పరిణామాలతో ఆడవాళ్లు బిక్కచచ్చిపోతారు..వారు తేరుకునేలోపే ఈ కిలాడీలు జంపైపోతారు.


అయితే ఢిల్లీలో జరిగిన ఓ తాజా ఘటనలో మాత్రం తల్లీ కూతుళ్లు గొలుసు దొంగలను పట్టుకుని రఫ్ అడించారు. నాంగ్లోయి ప్రాంతంలో ఓ మహిళ మెడలోంచి గొలుసును లాక్కునేందుకు దొంగలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కూతురుతో నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గమనించిన స్నాచర్లు ఆమె మెడలో గొలుసు కొట్టేసేందుకు ట్రై చేశారు.


మహిళ మెడ నుంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించగా తల్లీకూతుళ్లు వెంటనే అలర్టయ్యారు. గొలుసు లాగిన వాడి చేయి వదలకుండా పట్టుకున్నారు. వారు ఉండుంపట్టు పట్టడంతో దొంగ కిందపడిపోయాడు. దాంతో బైక్ బ్యాలన్స్ తప్పి.. బండి నడిపేవాడు కూడా కిందపడ్డాడు. ఇంతలో ఇదంతా చూస్తున్న స్థానికులు వారిలో ఒక దొంగను అక్కడే చుట్టుముట్టేశారు.


బండి నడుపుతున్న వ్యక్తి పారిపోగా గొలుసు లాగిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు దొంగకి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తరువాత ఆ రెండో వాడిని కూడా పట్టుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ తల్లీకూతుళ్ల వీరోచిత గాధ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: