మామిళ్లపల్లి దీప్తి తాను సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానని వివిధ రకాల ఉద్యోగాలు, సమస్యలు పరిష్కరిస్తానంటూ చెప్పి రూ.70లక్షలను కాజేసిన విషయం మనందరికీ తెలిసిందే. వివిధ పత్రికలలో  ప్రచురితమవుతున్నకథనాలతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. దీప్తి వారిని ఏవిధంగా  నమ్మించి మోసం చేసిందో చెప్పి ఏకరువు పెడుతున్నారు. నిందితురాలిని పోలీసులు వీలైనంత త్వరగా అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


దీప్తి బాబాయి మామిళ్లపల్లి కృష్ణ ప్రసాద్‌ పేరుతో ఉన్న మారుతీ డిజైర్‌ ఖరీదైన కారులో విలాసవంతంగా తిరుగుతూ నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి ఘరానా మోసాలకు పాల్పపడింది. కారుపై రిజిస్ట్రేషన్‌ నంబరు లేకుండా ‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ అని రాసుకొని దర్జాగా తిరిగింది. టీడీపీ హయాంలో ఎవరూ కారును నిలుపుదల చేసి కారు నంబరు విషయం అడిగే సాహసం చేయలేక పోయారు. గుంటూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా కారుకు గుంటూరులోని ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంది.


అయితే వారిలో ఓ డ్రైవర్‌కు గత నెలలో జీతం ఇవ్వకపోవడంతో మానేశాడు. ఇదిలా ఉంటే గుంటూరులోని ఓ బాధితుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకున్న సమయంలో ఖాళీ చెక్కుపై ఎంత డబ్బు అనే వివరాలు రాయకపోగా, ఆమె సంతకం కూడా లేకుండా ఇచ్చేసిందంటే బాధితుడిని ఎలా మోసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేంటి సంతకం లేదని బాధితుడు అడిగితే సంతకంతో పనేముంది నీకు హామీగా ఇస్తున్నానని నమ్మబలికింది. దీప్తి మోసాల గురించి వస్తున్న కథనాలతో ఆందోళన చెందిన  కొందరు బాధితులు కాకుమాను మండలంలోని మోసకారి గ్రామమైన బోడపాలెం వెళ్లి ఆరా తీశారు.


కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న దీప్తి టీడీపీ నాయకులతో మంతనాలు చేసినట్లు తెలిసింది. టీడీపీ మీద మక్కువ ఉన్న సీఐ రంగంలోకి దిగి దీప్తి గ్రామానికి ఎందుకు వెళ్లి విచారించారంటూ బాధితులకు ఫోన్‌ చేసి హెచ్చరించారు. ఇకపై అటువెళితే సహించేది లేదని, ఏదైనా ఉంటే దీప్తి పైనే ఫిర్యాదు చేసుకోవాలని ఆదేశించారు. నిందితురాలికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ముందుగా నిలుపుదల చేసి బాధితులకు న్యాయం చేయాలని భాదితులు  కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: