ప్రతి ఏడాది ఐఫా సినిమా అవార్డుల ప్రదాన కార్యక్రమం ప్రపంచంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఈ సారి స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రతి ఏడాదిలాగే బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, సినిమా, మీడియా, ఎంటర్టైన్మెంట్, రెన్యువబుల్ ఎనర్జీ, పురపాలన, రహదారుల అభివృద్ధి వంటి రంగాల్లో పలు దఫాలుగా చర్చలు నిర్వహించనున్నారు.
స్పెయిన్లో ఈ నెల 24న జరుగనున్న ఫిక్కీ- ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ సమావేశానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావుకు అహ్వానం అందింది. ఈ సమావేశాల్లో జరిగే ప్యానల్ డిస్కషన్లో పాల్గ్గొనాలని ఫిక్కీ నిర్వాహక బృందం కోరింది. సినర్జీస్ ఇన్ ఐటీ, స్మార్ట్ సిటీ, టూరిజం ప్రమోషన్ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా వారు కోరారు.
జులై 4న హైదరాబాద్లో జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ ప్రసంగించాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఫిక్కీ ఛైర్మన్ హర్షవర్దన్ నియోటియోతో పాటు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 'తెలంగాణలో వ్యాపార అవకాశాలు' అనే అంశంపై కేటీఆర్ను మాట్లాడాలని కోరుతూ తెలంగాణ ఫిక్కీ ఛైర్మన్ సంగీతారెడ్డి ఆహ్వానం పంపారు. ఫిక్కీ పంపిన రెండు అహ్వానాల పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.