ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ల మధ్య ఇంటర్కనెక్షన్ వివాదం మరింతగా ముదురుతోంది. ఎయిర్టెల్ కస్టమర్లతో తమ మొబైల్ వినియోగదారులు కనెక్ట్ అయ్యేందుకు వీలుగా తగినన్ని ఇంటర్కనెక్ట్ పాయింట్ల(పీఓఐ)ను కల్పించకపోవడంవల్ల రోజుకు 2 కోట్లకుపైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది. తమకు అవసరమైన పోర్ట్లలో నాలుగోవంతును మాత్రమే ఎయిర్టెల్ అందుబాటులో ఉంచిందని..
తన మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ, పోటీ కంపెనీలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. అయితే, జియో తాజా ఆరోపణలను ఎయిర్టెల్ ఖండిం చింది. అదనపు పీఓఐల విషయంలో జియో కావాలనే రాద్ధాంతం చేస్తోందని.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్పీ) విజ్ఞప్తులను అడ్డుకుంటున్నట్లు చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎంఎన్పీపై నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని తెలిపింది. కాగా, ఇంటర్కనెక్ట్ పోర్ట్లను కల్పించేందుకు కఠినమైన షరతులను విధిస్తోందని.. దీనివల్ల అదనపు పోర్ట్లను వినియోగించుకోవడానికి వీలవడంలేదని జియో పేర్కొంది.
మొబైల్ వినియోగదారులకు ఉచిత వాయిస్కాల్స్ ప్రయోజనాన్ని అందించాలన్న తమ ప్రయత్నాలకు గండికొట్టడంద్వారా ఎయిర్టెల్ గుత్తాధిపత్యానికి పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు గుప్పించింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ట్రాయ్ వెంటనే రంగంలోకి దిగాలని కోరింది. తమ రెండు నెట్వర్క్ల మధ్య కాల్స్ పూర్తి కావడానికి అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్లో నాలుగో వంతు ఇచ్చిందని, ఫలితంగా ఉచిత వాయిస్ కాల్స్ అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. మార్కెట్లో తమకున్న పేరును దెబ్బతీసేందుకు ఎయిర్టెల్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
అయితే, రిలయన్స్ ఆరోపణలను ఎయిర్టెల్ ఖండించింది. రిలయన్స్ జియో అవసరాలకు మించి కనెక్టివిటీ పాయింట్లను ఇచ్చామని చెబుతోంది. పెంచిన పీఓఐలతో రిలయన్స్ జియో 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఎటువంటి కాల్ డ్రాప్స్ లేకుండా వాయిస్ సేవలు అందుకునే అవకాశం ఉందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. రిలయన్స్కు ఉన్న పది కోట్ల మంది ఖాతాదారుల అవసరాల కంటే ఎక్కువ పీఓఐలే ఇచ్చినట్టు పేర్కొంది. జియో టెక్నాలజీలోనే లోపం ఉందని, దానిని సరిచేసుకోకుండా తమపై నిందలు వేయడం బాధాకరమని పేర్కొంది.